తిరుమలలో భారీగా తగ్గిన ధరలు: భక్తుల ఆనందం, లేదంటే ఇలా చేయొచ్చు
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల కొండపై హోటళ్లలో ధరలు దిగి వచ్చాయి. దీనిపై భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి వరకు ధరలు చాలా ఎక్కువగా ఉండేవి.
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల కొండపై హోటళ్లలో ధరలు దిగి వచ్చాయి. దీనిపై భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి వరకు ధరలు చాలా ఎక్కువగా ఉండేవి. కొద్ది రోజులుగా హోటళ్లలో ధరల పట్టికను ఏర్పాటు చేస్తున్నారు.
ఆ ధరల పట్టికకు మించి డబ్బులు వసూలు చేస్తే ఫిర్యాదు చేయవచ్చు. ధరలు దిగి రావడంతో భక్తులు హర్షం చేస్తున్నారు. తిరుపతి హోటళ్లలో అధిక ధరలపై వారం క్రితం హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం టీటీడీ అధికారుల్లో కదలిక కూడా వచ్చింది.
కోట్ చేసిన వారికి లైసెన్స్
తిరుమలలో పదికి పైగా పెద్ద రెస్టారెంట్లు, మరో అరడజను చిన్న జనతా క్యాంటీన్లు, మరెన్నో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, హోటళ్లు ఉన్నాయి. తిరుమలలో హోటళ్ల కేటాయింపుకు టీటీడీ షీల్డ్ టెండర్లు నిర్వహించి ఎక్కువగా కోట్ చేసిన వారికి మూడు సంవత్సరాల కాలపరిమితితో లైసెన్స్ జారీ చేస్తుంటుంది.
హైకోర్టు ఆగ్రహం, టీటీడీ చర్యలతో
టెండర్లు ఇచ్చినప్పుడే టీటీడీ నిబంధనల మేరకు విక్రయించాలని చెబుతుంటుంది. కానీ ఇష్టారాజ్యంగా ధరలు నిర్ణయించి వసూలు చేసేవారు. దీనిపై సేవా సమితి గత ఏడాది కోర్టుకు వెళ్లింది. కోర్టు ఆగ్రహం, టీటీడీ చర్యలతో హోటళ్లలో ధరల పట్టికలు ఏర్పాటు చేసారు.
చాలా వరకు ధరలు తగ్గాయి
ఇటీవలి వరకు ఫలహారం నుంచి భోజనం వరకు అధిక ధర ఉండేది. ఇప్పుడు చాలా తగ్గింది. రూ.25 ఉన్న ఇడ్లీ ధర రూ.7.50, చపాతి రూ.60 నుంచి రూ.20, బిర్యాని రూ.50 నుంచి రూ.19, ప్లేట్ మీల్స్ రూ.60 నుంచి రూ.22.50, భోజనం రూ.100 నుంచి రూ.31కి తగ్గింది.
ధరల పట్టిక తప్పనిసరి
ఈ మేరకు ప్రతి హోటల్ ముందు ధరల పట్టిక తప్పనిసరి. ప్రైస్ లిస్ట్ కచ్చితంగా ఉండాలని టీటీడీ ఈవో నిబంధన అమలు చేస్తోంది. అధిక ధరలు వసూలు చేసినా టీటీడీ టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేయవచ్చు. అయితే కొద్ది రోజులు అమలు చేసి తిరిగి పాతపరిస్థితి తీసుకు రావొద్దని భక్తులు కోరుతున్నారు.
హోటల్ యజమానుల ఆందోళన
మరోవైపు, తాము చెల్లిస్తున్న నెలవారీ అద్దెలు భారీగా ఉంటున్నాయని, వాటిని తగ్గిస్తేనే తాము వ్యాపారాలు చేసుకోగలమని హోటల్ యజమానులు వాపోతున్నారు. ఈ విషయంలో చర్చించి త్వరలోనే నిర్ణయానికి వస్తామని టీటీడీ అధికారులు చెబుతున్నారు.