అర్చకులకు శుభవార్త.. జీతాల్లో 25 శాతం పెంపు
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు శుభవార్త. 25 శాతం వేతనాలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెల్లంపల్లి శ్రీనివాస్ ఆ మేరకు తొలి సంతకం చేశారు. ఇకపై దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు 25 శాతం మేర వేతనాలు పెరగనున్నాయి.
అదేవిధంగా దేవాదాయ శాఖలో ఉద్యోగుల ఇళ్ల నిర్మాణం, బదిలీల మార్గదర్శకాలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు వెల్లంపల్లి శ్రీనివాస్. తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి దర్శనంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం.. కాళేశ్వరం విశిష్టతలేంటంటే..!
దేవాలయాల్లో సనాతన సంప్రదాయాలు, ఆచారాలు గౌరవించేలా విధివిధానాలు రూపొందిస్తామని తెలిపారు శ్రీనివాస్. తమ ప్రభుత్వంలో ఆలయాలకు రక్షణ కల్పిస్తామని.. దేవాలయాల పరిరక్షణకు ఎల్లవేళలా కృషి చేస్తామని చెప్పారు. దేవాలయ భూములను కబ్జా చేయాలని చూస్తే ఎంతటివారినైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పుకొచ్చారు. ఆలయ భూములను కబ్జా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
సదావర్తి లాంటి ఆలయ భూములను కబ్జా చేసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారని ఆరోపించారు శ్రీనివాస్. ఇకపై అన్ని దేవాలయాల్లో ప్రస్తుతమున్న పాలకమండళ్లను రద్దు చేస్తామని.. వాటి స్థానంలో కొత్త కమిటీలు నియమిస్తామని మంత్రి వెల్లడించారు.