గుడిలో రమణ దీక్షితులు...గుడి వెనక రాజకీయ దీక్షితులు..
తాగిన మైకంలో భార్యను చితకబాది మత్తు దిగిన తర్వాత ఇంత చిత్రహింస పెట్టానా బంగారం నిన్ను అని అడిగినట్టు ఉంది టీటీడి మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితుల వ్యవహారం. రమణ దీక్షితులుకు పదవిలో ఉన్నప్పుడు కనిపించని లోపాలు పదవి దిగిపోగానే కనిపించాయా అని ప్రశ్నిస్తున్నారు అర్చకులు. పదవిలో ఉన్నంత కాలం ఏ ఆభరణాలు ఎక్కడికి వెళ్లలేదు.,
అంతా ఆగమ శాస్త్రం ప్రకారం స్వామివారి కైంకర్యాలు జరిగాయని చెప్పిన ఆయన.. పదవి పోగానే ఆభరణాలు లేవు., ఆగమశాస్త్రం లేదు అన్నట్టు వ్యవహరించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది... వివాదాస్పద ఆరోపణలతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నమే కాకుండా, తిరుమల పవిత్రతకు, ప్రాశస్థ్యానికి భంగం కలిగించేలా వ్యవహరిస్తున్న దక్షితులు పై టీటీడి అర్చకుల సంఘం మండిపడుతోంది. తాజాగా ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ని ఆయన నివాసం లోటస్ పాండ్ లో కలుసుకొని కొత్త వివాదానికి తెర తీసారు దీక్షితులు.
రమణదీక్షితులు జగన్ తో జరిపిన మంతనాల మతలబు ఏంటి..
టీడీపీ వెతకబోయిన తీగ లోటస్ పాండ్ లో తగిలింది. టీటీడీలో మంత్రాలు ఉచ్చరించిన మనిషి లోటస్ పాండ్ లో మంతనాలు జరుపుతూ కెమెరాకు చిక్కారు. వివాదాస్పద టీటీడీ మాజీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు లోటస్ పాండ్ లోని జగన్ నివాసానికి వెళ్లారు. జగన్ తో అరగంట పాటు మంతనాలు జరిపారు. ఇటీవల టీటీడీలో అర్చకుల రిటైర్మెంట్ వయస్సు పై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని ప్రభావంతో రమణ దీక్షితులు ఉద్యోగం ఊడింది. ఆ కోపంతో ఆయన ప్రభుత్వానికి, చంద్రబాబునాయుడుకు వ్యతిరేకంగా గళం విప్పారు.
టీటీడీలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పోటు వద్ద నేళమాళిగలో తవ్వకాలు జరిగాయని ఆరోపించారు. విలువైన ఆభరణాలు పోయాయని కూడా ఆరోపించారు. పింక్ డైమండ్ కనిపించడం లేదని సంచలనం చేసారు.
సురక్షితంగా ఉన్న ఆభరణాలు తన పదవి పోగానే ఎలా మాయమయ్యాయి..
ఈ ఆరోపణలపై నేరుగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగాల్సి వచ్చింది. టీటీడీ ఈవో సింఘాల్, ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ ను పిలిచి బాబు సమీక్ష జరిపారు. తిరుమలలో ఏ అక్రమాలు జరగడం లేదని, ఆభరణాలన్నీ భద్రంగా ఉన్నాయని, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరణ ఇచ్చుకున్నారు. రమణదీక్షితులు ఆరోపణల పై సీబీఐ విచారణ జరపాలని బీజేపీ డిమాండ్ చేసింది. జగన్ మాత్రం దీనిపై ఎక్కడా పెద్దగా స్పందించలేదు.
సడెన్ గా దీక్షితులు లోటస్ పాండ్ లో ప్రత్యక్షం కావడం ఇప్పుడు రాజకీయవర్గాలు ఉలిక్కిపడేలా చేసింది. వాస్తవానికి రమణదీక్షితులు వైఎస్ కుటుంబ అభిమాని అన్నది చాలా కాలంగా ప్రచారం ఉంది. దీక్షితులు ఇంట్లో వెంకటేశ్వరస్వామి చిత్రపటం పక్కనే వైఎస్ తో దిగిన ఫోటోలు ఉన్న దృశ్యాలు కూడా మీడియాలో వచ్చాయి. రిటైర్మెంట్ వయస్సు వ్యవహారంలో ఈ మధ్య ప్రభుత్వం పై దీక్షితులు ఆరోపణల దాడి పెంచారు. ఆ క్రమంలోనే జగన్ ను కలవడం రాజకీయవర్గాల్లో కలకలం రేపుతోంది.
రమణ దీక్షితులుతో ఎవరు నాటకలాడిస్తున్నారో తెలుసన్న చంద్రబాబు..
తిరుమలలో భక్తుల మనోభావాల గురించి మాట్లాడే దీక్షితులు ఇలా ఓ రాజకీయ నేత ఇంట్లో ప్రత్యక్షం కావడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పైగా లోటస్ పాండ్ ని జగన్ కుటుంబం ఓ చర్చి మాదిరిగా భావిస్తుంది. ఆ ఇంటి ఆవరణలో శిలువ కూడా ఏర్పాటు చేశారు. హైందవ సాంప్రదాయాలు, భక్తుల విశ్వాసాల గురించి విలువలు వల్లించే దీక్షితులు ఫక్తు రాజకీయ నాయకుడు మాదిరిగా లోటస్ పాండ్ కు వెళ్లడం విశేషం. దీంతో రమణ దీక్షితులు ఇన్నాళ్లు చేస్తోన్న ఆరోపణలకు అర్థం లేకుండా పోయినట్టయింది. కేవలం ప్రభుత్వం పై అక్కసుతో తప్ప, ఆయన ఆరోపణల్లో పసలేదన్న భావన కలిగించేలా ఆయన తాజా చర్యలు ఉన్నాయి.
నిజం చెప్పాలంటే రమణ దీక్షితులు జగన్ ను కలవడం పెద్ద నేరం ఏమీ కాదు. అది మామూలు సందర్భంలో అయితే ఎవరూ పట్టించుకోరు. ఓ వైపు తిరుమలలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ... సాంప్రదాయాలకు, హైందవ విలువలకు తాను నిలువెత్తు రూపం అన్నట్టు చెప్పుకునే దీక్షితులు సడెన్ గా ఇలా సరికొత్త రాజకీయంతో తెర మీదకు రావడమే ఇక్కడ కొత్తకోణం.
తిరుమలను వివాదాల్లోకి లాగొద్దంటున్న అర్చకుల సంఘం..
తనను రాజకీయంగా దెబ్బతీయడానికి తిరుమలను సైతం వివాదాల్లోకి లాగుతున్నారని ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఇప్పుడు ఆయన వాదనకు బలం చేకూర్చేలా దీక్షితులు ఇలా జగన్ తో మంతనాలు జరపడం ప్రజల్లో సందేహాలు రేకెత్తిస్తోంది.
దీక్షితులు చేసిన ఆరోపణల పై ఇన్నాళ్లు కొంత మందికైనా అనుమానాలు ఉండి ఉండవచ్చు. కానీ, తాజా దృశ్యంతో దానిని ఆయన పూర్తి స్థాయి రాజకీయ క్రీడగా మార్చేశారు. రమణ దీక్షితులు మాదిరిగా గతంలో ఏ టీటీడీ అర్చకుడూ ఇంతలా రాజకీయ నేతలతో రాసుకుపూసుకు తిరిగుండరు. ఆ ఘనత కూడా దీక్షితులుకే దక్కుతుంది. తిరుమల కేంద్రంగా ఇలా రాజకీయం పడగ విప్పుతుంటే ఇక తన ఏడు కొండలను ఆ వేంకటేశ్వరుడే కాపాడుకోవాలి.