నాకేం సంబంధం!: చింటూ, ఉరితీయాలని మేయర్ కూతుళ్ల కంటతడి
చిత్తూరు: మేయర్ కటారి అనురాధ, ఆమె భర్త మోహన్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని వారి మేనల్లుడు, కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న చింటూ అలియాస్ చంద్రశేఖర్ సోమవారం నాడు న్యాయస్థానంలో చెప్పాడు. జిల్లా ఎస్పీ శ్రీనివాస్ మీడియా సమావేశంలో ఉండగా.. చింటూ కోర్టులో లొంగిపోయాడు.
అతను నేరుగా నాలుగో అదనపు జిల్లా న్యాయమూర్తి హాలుకు వెళ్లాడు. గదిలోకి వెళ్లిన అతను న్యాయమూర్తికి ఓ పిటిషన్ అందజేశాడు. మేయర్ అనురాధ దంపతుల హత్య కేసులో తన ప్రమేయం లేదని ఆ పిటిషన్లో పేర్కొన్నాడు.
అయితే, అప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి ఉన్న నేపథ్యంలో చింటూకు జ్యూడిషియల్ కస్టడీ విధిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తర్వాత పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ను పరిశీలించిన న్యాయమూర్తి పద్నాలుగు రోజుల పాటు చింటూను పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
చిత్తూరులో ఉద్రిక్తత
మేయర్ అనురాధ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడు చింటూ సోమవారం కోర్టులో లొంగిపోవడంతో న్యాయస్థానం ప్రధాన ద్వారం ఎదుట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చింటూ లొంగిపోయాడన్న సమాచారం అందుకున్న మేయర్ కుటుంబ సభ్యులు, అభిమానులు, టిడిపి కార్యకర్తలు కోర్టు ఎదుట ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా చింటూను ఉరితీయాలని నినాదాలు చేశారు. కేసును న్యాయవాదులు వాదించరాదని, తమకు న్యాయం కావాలంటూ నినాదాలు చేశారు. చింటూను కోర్టు నుంచి కడప జైలుకు తరలించడానికి వాహనాన్ని సిద్ధం చేయగా అడ్డుకోవడానికి యత్నించారు.
దాంతో పోలీసులు వారిని అక్కడి నుంచి పక్కకు పంపించి వాహనం వెళ్లడానికి ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంలో పోలీసులు, మేయర్ బంధువులకు తోపులాట చేసుకుంది. పోలీసులు లాఠీఛార్జి చేసి వారిని చెదరగొట్టారు.
అనంతరం చింటూను తరలిస్తున్న వాహనం కోర్టు ప్రధాన ప్రవేశ ద్వారం నుంచి రహదారి పైకి రాగానే మేయర్ అభిమానులు వాహనంపై చెప్పులు విసిరారు. 'మా అమ్మ నాన్నలను దారుణంగా హత్య చేసిన చింటూను ఉరితీయండి' అంటూ మేయర్ దంపతుల కుమార్తెలు లావణ్య, హేమలత కంటతడి పెట్టారు.
కోర్టు ఎదుట జరిగిన రాస్తారోకోలో వారు పాల్గొని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు చింటూ పైన నిప్పులు చెరిగారు. అనంతరం వారు కార్పొరేటర్లు, టిడిపి కార్యకర్తలతో కలసి గాంధీ విగ్రహ కూడలి వద్దకు చేరుకుని రహదారిపై బైఠాయించారు. దాంతో వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్కు అంతరాయం కలిగింది.
తమ తల్లిదండ్రుల్ని అతి కిరాతకంగా చంపిన చింటూ తరఫున న్యాయవాదులు ఎవరూ వాదించవద్దని అనురాధ కుటుంబ సభ్యులు చిత్తూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీంద్రనాథ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలని బోరున విలపించారు.