తనిష్క్ చోరీ: వారిద్దరు కలలు కని, కటకటాల వెనక్కి
హైదరాబాద్: తమ కలలను సాకారం చేసుకోవడానికి తనిష్క్ బంగారం దుకాణంలో చోరీకి పాల్పడిన ఇద్దరు మిత్రులు కటకటాల వెనక్కి వెళ్లారు. తనిష్క్ బంగారం దుకాణంలో జరిగిన చోరీ కేసులో రెండో నిందితుడు ఆనంద్ను పోలీసులు బుధవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. గుంటూరు జిల్లా ఈపూరుకు చెందిన ఆనంద్ను పోలీసులు కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించారు. అదే ఊరికి చెందిన కిరణ్తో కలిసి ఆనంద్ చోరీకి పాల్పడినట్లు డిసిపి సత్యనారాయణ మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు.
కిరణ్ పైలట్ కావడానికి, ఆనంద్ పోలియో చికిత్స చేయించుకుని నృత్యంలో రాణించడానికి చోరీకి పాల్పడినట్లు ఆయన తెలిపారు. మూడు బ్యాగుల్లో 15.57 కిలోల బంగారం, విలువైన రాళ్లతో పొదిగిన మరికొన్ని ఆభరణాలను వారు చోరీ చేశారని ఆయన చెప్పారు. బంగారం బ్యాగుల్లో పెట్టుకుని ప్రయాణికుల మాదిరిగా ఆటోలో రసూల్పురాలోని తమ గదికి వెళ్లి ఆభరణాలను దాచి పెట్టారని చెప్పారు.
ఒక నగల దుకాణంలో నిందితులు నగలను అమ్మడానికి ప్రయత్నించగా దుకాణం యజమాని వాటికి సంబంధించిన రశీదులు చూపాలని అడిగాడని, దాంతో తాము దొరికిపోతామని ఆందోళన చెంది లొంగిపోయారని సత్యనారాయణ తెలిపారు. ఆనంద్ వద్ద నుంచి 10 బంగారు గాజులు, నాలుగు నెక్లెస్లు, 10 బ్రేస్లెట్లు, 15 ఉంగరాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మీడియా, పోలీసు దూకుడు చూసి నిందితులు భయపడ్డారని డిసిపి చెప్పారు. సిసి ఫుటేజ్ ఆధారంగా నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. తెలివిగా, వ్యూహాత్మకంగా వారు దొంగతనం చేశారని చెప్పారు. పక్కా పథకం ప్రకారమే చేశారని చెప్పారు. ఆధారాలు దొరకకుండా జాగ్రత్త పడ్డారని ఆయన అన్నారు. వెంట్రుకలు రాలిపడకుండా జుట్టుకు జెల్ రాసుకున్నట్లు ఆయన తెలిపారు. వారు దొంగతనం చేసిన సమయంలో సెక్యూరిటీ సిబ్బంది పడుకున్నట్లు తెలిపారు.
దొంగతనానికి కిరణ్, ఆనంద్ మూడు సార్లు రెక్కీ నిర్వహించారని ఆయన చెప్పారు. కిరణ్ పథకం రచించగా ఆనంద్ అమలు చేశాడని అన్నారు. స్క్రూడ్రైవర్ పెట్టి సుత్తితో కొట్టి గోడ బద్దలు కొట్టి వారు లోనికి ప్రవేశించినట్లు డిసిపి తెలిపారు. కిరణ్ బయట కాపలా ఉండగా ఆనంద్ దుకాణంలోకి వెళ్లి దొంగతనం చేశాడు. ఐరిష్ కనపడకుండా కళ్లద్దాలు కూడా ధరించారు. పోలీసు కుక్కలు పసిగట్టకుండా కారపు పొడి చల్లారు.
చోరీ సొత్తు అమ్మడానికి గానీ తాకట్టు పెట్టడానికి గానీ చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో వారు భయపడిపోయి లొంగిపోయారని డిసిపి చెప్పారు. దీన్ని కప్పిపుచ్చుకోవడానికి కట్టుకథలు అల్లారని చెప్పారు. వేరే వాళ్ల ప్రమేయం ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ కనిపించలేదని డిసిపి చెప్పారు.