సీఎం జగన్ ఆహ్వానించారు..ప్రధాని మాత్రం రానట్లే..!! రైతు భరోసా పాలిటిక్స్: అసలేం జరిగింది..!
ఏపీలో ముఖ్యంత్రి జగన తన నవరత్నాల్లో భాగంగా రైతు భరోసా పధకాన్ని ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఈ పధకం ప్రారంభానికి ప్రధానిని ఆహ్వానించారు. ఈ పధకం ద్వారా ఏటా రైతులకు రూ. 12,500 ఇవ్వనున్నట్లు గతంలోనే ముఖ్యమంత్రి ప్రకటించారు. దీనికి ప్రధానిని గతంలో ఢిల్లీ వెళ్లిన సమయంలోనే ఆహ్వానించారు. తాజాగా ఢిల్లీ వెళ్లిన సీఎం జగన్ ప్రధానికి ఈ స్కీం ద్వారా రైతులకు ఏ రకంగా సాయం చేయనున్నదీ వివరించారు. దాదాపు 54 లక్షల మందిర రైతు కుటుంబాలకు జరిగే ప్రయోజనం గురించి చెప్పుకొచ్చారు.
దీని కోసం దాదాపు రూ.5,500 కోట్లు ఈ నెల 15న విడుదల చేయాలని నిర్ణయించామని..మీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయాలని ఆహ్వానించారు. ప్రధాని సైతం ఆసక్తి చూపారు. అదే సమయంలో కీలక వ్యాఖ్యలు చేసారు. ముఖ్యమంత్రి తన ప్రతిపాదన మోదీ ముందు ఉంచారు. అయితే..ప్రధాని ఈ కార్యక్రమానికి వస్తున్నారా..అంటే అక్కడ నుండి వస్తున్న సమాధానం ఏంటంటే...
రైతు భరోసా స్కీంకు ప్రధానికి ఆహ్వానం..
ఏపీలో ఈ నెల 15న రైతు భరోసా ప్రారంభించాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. దీనిని ప్రదాని చేతుల మీదుగా ప్రారంభించేలా ఆయన్ను ఒప్పించే ప్రయత్నం చేసారు. అందులో భాగంగా ప్రధానితో సమావేశ సమయంలో పధకం ఉద్దేశాలను వివరించారు. అయితే..తొలుత రాష్ట్ర ప్రభుత్వం మొత్తంగా రూ. 12,500 ఇవ్వాలని నిర్ణయించింది. అయితే..రాష్ట్రంలో ఉన్న ఆర్దిక ఇబ్బందుల కారణంగా.. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన ఏటా ఆరు వేల సాయం సైతం ఇందులో కలిపి.. రైతులకు అందించాలని నిర్ణయించింది. కేంద్రం వాటా కూడా ఉండటంతో ప్రధాని ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభిస్తే రాజకీయంగా విమర్శలకు అవకాశం లేకుండా.. కేంద్ర .. రాష్ట్ర ప్రభుత్వాల స్కీంగా అమలు చేసేందుకు ముఖ్యమంత్రి ఆలోచన చేసి ప్రధానిని ఆహ్వానించారు.
ఆ సమయంలో కీలక ప్రతిపాదన
ప్రధానికి ఈ పధకం గురించి వివరిస్తూ ముఖ్యమంత్రి జగన్ మరో కీలక ప్రతిపాదన చేసినట్లుగా సమాచారం. తాము అమలు చేయనున్న ఈ పధకం లో కేంద్రం వాటా కూడా ఉండటంతో కేవలం రాష్ట్ర ప్రభుత్వ స్కీంగా మాత్రమే కాకుండా.. ప్రధాని పేరును సైతం జోడించి పధకాన్ని అమలు చేసేందుకు సిద్దంగా ఉన్నామని ముఖ్యమంత్రి ప్రతిపాదించినట్లుగా తెలుస్తోంది. అయితే..ముఖ్యమంత్రి ఉద్దేశాన్ని తాను అర్దం చేసుకోగలనని.. రైతులకు మేలు చేసే అంశాల్లో కేంద్రం అండగా ఉంటుందని ప్రధాని వ్యాఖ్యానించినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే..కేంద్రం వాటా ఉండటంతో తొలుత వైయస్సార్ రైతు భరోసాగా పేరు ఖరారు చేసిన ఈ పధకానికి ఇప్పుడు ప్రధాని పేరు సైతం జోడిస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది.
ప్రధానికి ముందే బీజేపీ నేతల అభ్యంతరం..
అయితే..రైతు భరోసా ప్రారంభానికి ప్రధానిని ఆహ్వానించామని ముఖ్యమంత్రి ఇప్పటికే చెప్పటంతో..ఏపీ బీజేపీ నేతలు మాత్రం దీని పైన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర నిధులు సైతం ఈ పధకానికి వినియోగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే అమలు చేస్తున్న విధంగా ఏపీ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుందని స్థానిక బీజేపీ నేతలు జాతీయ నాయకులకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విధంగా అదే పేరుతో ఈ పధకం అమలు చేస్తున్న సమయంలో..ప్రధాని హాజరవుతే పార్టీకి రాజకీయంగా నష్టం జరుగుతుందని ఢిల్లీ బీజేపీ పెద్దలకు వివరించినట్లు సమాచారం. కేంద్రం నిధులు సైతం రైతులకు ఇస్తున్నారనే విధంగా దీని పైన వ్యవహరించాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.
ప్రధాని కార్యాలయం ఏం చెబుతోంది...
ముఖ్యమంత్రి జగన్..స్వయంగా ప్రధాని వద్దకు వెళ్లి రైతు భరోసా ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించారు. అందు కోసం ఈ నెల 15న నెల్లూరు జిల్లాలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రధాని హాజరయ్యేందుకు ప్రయత్నిస్తానని చెబుతూనే తన బిజీ షెడ్యూల్ ను సైతం ప్రస్తావించారు. ఈ నెల 11వ తేదీ నుండి మూడు రోజుల పాటు చైనా అధ్యక్షుడు జింగ్ పింగ్ భారత్ లో పర్యటిస్తున్నారని.. అదే కాకుండా మహారాష్ట్ర..హర్యానా ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ఎన్నికల ప్రచారం షెడ్యూల్ సైతం బీజీగా ఉందని చెప్పినట్లు సమాచారం. దీంతో..దాదాపుగా ఆయన ఈ కార్యక్రమానికి రాలేననే సంకేతాలు ఇచ్చినట్లుగా అర్దం అవుతోంది. అయితే..ఏపీకి మాత్రం పూర్తి సహకారం ఉంటుందని ప్రధాని భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది.