ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి...హామీ ఇచ్చిన మోడీపై ఆ బాధ్యత ఉంది:బాబా రాందేవ్
విజయవాడ:ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కల్పిస్తామని పార్లమెంటులో ఇచ్చిన హామీని అమలు చేయాల్సిన బాధ్యత ప్రధానమంత్రి మోడీపై ఉందని పతంజలి యోగ సమితి వ్యవస్థాపకుడు, ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా అన్నారు.
బుధవారం ఆయన విజయవాడ సమీపంలోని తాడేపల్లిలోని సీఎస్ఆర్ కళ్యాణ మండపంలో నిర్వహించిన 'యువ స్వావలంబన సమ్మేళనం' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబా రాందేవ్ ఒక తెలుగు న్యూస్ ఛానెల్ తో మాట్లాడుతూ ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పనితీరును ప్రస్తుతించడంతో పాటు వివిధ అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు.
చంద్రబాబు... డైనమిక్ లీడర్
తాడేపల్లిలో ‘యువ స్వావలంబన సమ్మేళనం' కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ ఒక తెలుగు న్యూస్ ఛానెల్ తో ఇంటర్వ్యూ సందర్భంగా చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు. నవ్యాంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు డైనమిక్ లీడర్ అని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఆయన బాగా కృషి చేస్తున్నారని బాబా రాందేవ్ కితాబిచ్చారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయాధారిత రాష్ట్రం కాబట్టి వ్యవసాయ రంగ అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ప్రోత్సహిస్తే రాష్ట్రం బాగా అభివృద్ధి చెందుతుందని ఆయన సూచించారు.
సేంద్రీయ వ్యవసాయం...మేలు
ఆహార పంటలతో సహా అన్ని రకాల పంటలపై ఇష్టమొచ్చినట్లుగా పురుగు మందులను పిచికారీ చేస్తుండటం వల్ల మనం తినే ఆహారం విషతుల్యమవుతోందని బాబా రాందేవ్ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రజలు తినే ఆహారం మొదలుకొని అనారోగ్యం చేస్తే ఔషధాల వరకు అన్నింటిని విదేశాలనుంచి దిగుమతి చేసుకుంటున్నామని...దీనివల్ల దేశం ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతింటోదన్నారు. ఇకదీనికి ముగింపు పలకాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పతంజలి సంస్థలు ముందు స్వదేశీ ఉద్యమం...తర్వాత వ్యవసాయంపైనే ప్రధానంగా దృష్టి సారించినట్లు ఆయన చెప్పారు.
గోవధ...మంచిది కాదు
మన దేశంలోని ప్రజలు గోవులను భక్తిశ్రద్ధలతో పూజిస్తారని, గో మూత్రం మొదలుకుని పాల వరకు ప్రజలు వినియోగించుకుంటున్నారని...అలాంటి గోవులను వధించడం మంచిది కాదని అన్నారు. గో భక్తుడిగా, దేశభక్తుడిగా చెప్పుకుంటున్న ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో గోవధను నిషేధించాలని ఆయన డిమాండ్ చేశారు. దేశానికి యువతే గొప్ప ఆస్తి అని...కానీ మన దేశంలో నిరుద్యోగం ప్రధాన సమస్యగా మారిందన్నారు.
2019 ఎన్నికలు...ఆసక్తికరం
రాజకీయాల రంగ ప్రవేశం గురించి బాబా రాందేవ్ ను ప్రశ్నించగా...తాను ప్రత్యక్ష రాజకీయాల్లో లేనని...అయితే 2019 సాధారణ ఎన్నికలు చాలా ఆసక్తికరంగా మారనున్నాయని అంచనావేశారు. ఇప్పటికే అనేక సర్వేలు జరుగుతున్నాయని...అయినప్పటికీ వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందనేది చెప్పడం కష్టమని అభిప్రాయపడ్డారు. ఓటర్లు ఎన్నికల్లో విచక్షణతో ఓటు వేయాలని ఆయన సూచించారు. లేకపోతే దేశంలో రాజకీయ సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని బాబా రాందేవ్ చెప్పుకొచ్చారు.
కేరళను...కేంద్రం ఆదుకోవాలి
జలవిలయంతో అతలాకుతలమైన కేరళ రాష్ట్రాన్ని ఆదుకోవడం కేంద్ర ప్రభుత్వం ధర్మమని బాబా రాందేవ్ అన్నారు. కేరళ ప్రజలు కష్టాల నుంచి బైటపడాలంటే అన్ని రాష్ట్రాలూ సాయం చేసి ఆదుకోవాలని రాందేవ్ పిలుపునిచ్చారు. పతంజలి సంస్థ తరపున 2 కోట్ల రూపాయల విలువైన సరకులు, ఇతర ఉత్పత్తులను పంపించి వరద బాధితులకు అందజేసే ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.