ప్రత్యేకతలివే: అమరావతి ఫోటో గ్యాలరీని ఆసక్తిగా తిలకించిన ప్రధాని మోడీ
అమరావతి: నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రధాని నరేంద్రమోడీకి ఘన స్వాగతం లభించింది. గన్నవరం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో అమరావతి శంకుస్థాపన ప్రాంగణానికి చేరుకున్న ప్రధాని మోడీకి పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు.
అనంతరం ప్రత్యేక వాహనంలో ప్రధాని మోడీ శంకుస్థాపన జరిగే సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ముందుగా శతాబ్దాల ఘన చరిత్ర కలిగిన రాజధాని ప్రాంత వైశిష్ట్యంతోపాటు వర్తమానంలోని గ్రామాల రూపురేఖల్నీ, భవిష్యత్లో ఈ ప్రాంతం ఏ విధంగా రూపుదిద్దుకోబోతుందనే అమరావతి ఫోటో గ్యాలరీని సందర్శించారు.
శంకుస్థాపన ప్రాంగణంలోనే ప్రత్యేక పెవిలియన్ను ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన త్రీడీ చిత్ర ప్రదర్శనను ప్రధాని మోడీ ఆసక్తిగా తిలకించారు. ఏదో చూడాలి కదా అన్న తీరుగా కాకుండా ప్రతి ఫొటో వద్ద కొద్దిసేపు నిలబడి సదరు ఫొటోను ఆయన ఆసక్తిగా పరిశీలించారు.
ఆయా ఫొటోలకు సంబంధించిన వివరాలు, విశేషాలను ప్రదానికి వివరించేందుకు ఏపీ ట్రాక్స్ కో సీఎండీ అజయ్ జైన్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అజయ్ జైన్ వివరిస్తున్న అంశాలను మోడీ ఆసక్తిగా విన్నారు. అమరావతి ప్రాంత గొప్పదనాన్ని మూడు విభాగాల్లో ఛాయాచిత్రాలు, శిల్పాల ద్వారా చూపించారు. ఈ చిత్ర విశేషాలను నిర్వహకులు ప్రధాని మోడీకి వివరించారు.
తొలి విభాగంలో ఘన చరిత్రనీ, మరో విభాగంలో వర్తమానంలో రాజధానికి భూములిచ్చిన 29 గ్రామాల రూపురేఖలు, అక్కడి జీవనశైలుల్నీ, భవిష్యత్ విభాగంలో సింగపూర్ ఇచ్చిన బృహత్ ప్రణాళిక ప్రకారం ఆ గ్రామాలు ఏ విధంగా అభివృద్ధి చెందబోతున్నదీ తెలిపే వూహాచిత్రాలు ఉన్నాయి.
చరిత్రాత్మక అంశాలను ప్రదర్శించే విభాగంలో ఆదిమానవుడి అడుగుజాడలు, వివిధ రాజవంశాల పాలన, శైవ, బౌద్ధాలకు కేంద్రంగా విరాజిల్లిన వైనం నుంచి రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు 1797లో అమరావతి పట్టణాన్ని నిర్మించిన విధానం వరకూ ఉన్న ఆధారాలను సభా ప్రాంగణంలో ఏర్పాటు చేశారు.
దాంతోపాటు 2006లో దలైలామా 29వ కాలచక్ర మహాసమ్మేళనం నిర్వహించిన వైనాన్నీ ఆవిష్కరించారు. ఈ ఫోటో గ్యాలరీలో పలు ఛాయాచిత్రాలు, కాలచక్ర మ్యూజియంలో భద్రపరచిన ఆధారాలు, అమరావతి శిల్ప సౌందర్యాన్ని తెలిపే నమూనాలను ప్రదర్శించారు.
శాతవాహనుల కాలం నాటి నాణేలను కూడా ప్రదర్శనకు ఉంచారు. పొథిన్, సీసం, రాగితో చేసిన అరుదైన నాణేలను తీసుకువచ్చారు. ఈ ఫోటో గ్యాలరీని వీక్షించే సమయంలో ప్రధాని మోడీ వెంట సింగపూర్ మంత్రి ఈశ్వరన్, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు రోశయ్య, నరసింహాన్, కేంద్ర మంత్రి వెంకయ్య తదితరులు ఉన్నారు.