మోడీ స్కీం, గల్లా సూచన: బుర్రిపాలెంని దత్తత తీసుకోనున్న మహేష్ బాబు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలోగల బుర్రిపాలెం గ్రామాన్ని తాను త్వరలో దత్తత తీసుకుంటానని ప్రిన్సి మహేష్ బాబు ఆదివారం ప్రకటించారు. ప్రముఖులు వారి వారి గ్రామాలను దత్తత తీసుకోవాలని, అభివృద్ధి చేయాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
ఇటీవల మహేష్ బాబు హీరోగా వచ్చిన శ్రీమంతుడు సినిమాలో అదే పాయింట్ ఉంది. ఈ నేపథ్యంలో మహేష్ బాబు తన తండ్రి కృష్ణ జన్మించిన బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చారు. శ్రీమంతుడు చిత్ర యూనిట్ నేడు సినిమా విజయవంతంపై సక్సెస్ మీట్ను నిర్వహించారు.
ఈ సందర్భంగా మహేశ్ బాబు మాట్లాడారు. తమ సొంతూరైన బుర్రిపాలెం గ్రామాన్ని త్వరలో దత్తత తీసుకుంటానని చెప్పారు. బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకోవాలని షూటింగ్ సమయంలో తన బావ, ఎంపీ గల్లా జయదేవ్ సూచించారన్నారు. బుర్రిపాలెం దత్తత విషయమై చర్చించామని చెప్పారు.
కాగా, ప్రధాని మోడీ పిలుపు మేరకు పలువురు పారిశ్రామికవేత్తలు, సినిమా తారలు, ఎంపీలు, మంత్రులు గ్రామాలను దత్తత తీసుకున్నారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాలోని పుట్టంరాజు కండ్రిగను దత్తత తీసుకున్న విషయం తెలిసిందే.