అమరావతిపై భారీ ట్విస్ట్- రాజధాని ఖర్చు వివరాలు కోరిన హైకోర్టు-నిరాకరించిన పీఏజీ
ఏపీలో అభివృద్ది వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల ఏర్పాటు కోసం వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు హైకోర్టు ఎక్కడికక్కడ బ్రేకులు వేస్తూనే ఉంది. దీనిపై ఇప్పటికే దాఖలైన వందకు పైగా కేసులను విచారిస్తున్న హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని పలు వివరాలు కోరింది. అదే సమయంలో అసలు అమరావతిపై ఇప్పటివరకూ పెట్టిన ఖర్చెంతో చెప్పాలని అకౌంటెంట్ జనరల్ను కోరింది. వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది. అఫిడవిట్ దాఖలు చేయడంలో ఆలస్యం కావడంపైనా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చివరికి ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం తాము దాఖలు చేసిన అఫిడవిట్లో అమరావతి కోసం పెట్టిన ఖర్చు వివరాలు బయటపెట్టేందుకు నిరాకరించింది.
అమరావతిలో చేసిన ఖర్చెంత ?
అమరావతి నుంచి ఏపీ రాజధానిని విశాఖపట్నానికి తరలించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటి విచారణ సందర్భంగా అమరావతిలో భారీ భవనాల నిర్మాణం ఇప్పటికే పూర్తయిందని, హైకోర్టుతో పాటు అసెంబ్లీ, ఉద్యోగుల క్వార్టర్స్ నిర్మాణం కూడా పూర్తయ్యాయని, రాజధాని తరలిస్తే ఇవన్నీ నిరుపయోగంగా మారిపోతాయని హైకోర్టులో పిటిషనర్లు వాదించారు. కానీ వీటిపై ప్రభుత్వం పెట్టిన ఖర్చెంతో మాత్రం తేలలేదు. దీంతో హైకోర్టు అమరావతిలో ఇప్పటివరకూ చేసిన ఖర్చెంతో చెప్పాలని అకౌంటెంట్ జనరల్ను ఆదేశించింది.
వివరాలు ఇవ్వలేమన్న ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్
అమరావతి రాజధాని కోసం గత ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందనే అంశం తేల్చేందుకు హైకోర్టు అడిగిన వివరాలు ఇచ్చేందుకు ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం నిరాకరించింది. ఈ మేరకు డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ ఆర్.భోజ్గధియా హైకోర్టులో అఫిడివిట్ దాఖలు చేశారు. ఇందులో ఆయన అకౌంటెంట్ జనరల్ వ్యవస్ధ అధికారులు, స్వతంత్రత, బాధ్యత వంటి అంశాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం నుంచి తమకు లభించిన వివరాల్లో తాము నిర్వహించిన టెస్ట్ చెక్ ఆధారంగా తయారు చేసిన నివేదికలు రాష్ట్రపతికి, గవర్నర్కు మాత్రమే ఇస్తామని, తర్వాత వాటిని తిరిగి చట్ట సభల్లో ప్రవేశపెట్టాలని ఆర్టికల్ 151 చెబుతోందని పీఏజీ కార్యాలయం పేర్కొంది. కాబట్టి తమను ఇంప్లీడ్ చేస్తూ మండవ రమేష్ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేయాలని పీఏజీ కోరింది.
Recommended Video
అమరావతి ఖర్చు తేల్చడం కష్టమే...
అమరావతిలో పెట్టిన ఖర్చు వివరాలు వెల్లడించేందుకు ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం నిరాకరించింది. కాగ్ చట్టం ప్రకారం ఏర్పాటైన స్వతంత్ర వ్యవస్ద అయిన తాము కార్యనిర్వాహక, శాసన వ్యవస్ధల్లో భాగం కాదని హైకోర్టుకు క్లారిటీ కూడా ఇచ్చేసింది. మా నివేదికలు రాష్ట్రపతి, గవర్నర్కే వెళ్లాలి తప్ప మీకు నేరుగా ఇవ్వలేమంటూ స్పష్టం చేసింది. దీంతో అమరావతికి పెట్టిన ఖర్చు పద్దుల్లో ఏమైనా తేడాలుంటే కాగ్ నివేదికలో అవి బయటికి రావాల్సిందే తప్ప పూర్తి వివరాలు వెల్లడి కావడం సాధ్యం కాదని తేలిపోయింది.
ఈ నేపథ్యంలో హైకోర్టు అమరావతికి పెట్టిన ఖర్చు తెలుసుకునేందుకు ఏం చేయబోతోందన్నది ఉత్కంఠగా మారింది.