విద్యార్థుల స్కూలు ఫీజులతో ఉడాయించేందుకు ప్రిన్సిపాల్ యత్నం; అరెస్ట్
నెల్లూరు:విద్యార్థుల వద్ద వసూలు చేసిన స్కూలు ఫీజులను పాఠశాల యాజమాన్యానికి కట్టకుండా పరారయ్యేందుకు ప్రయత్నించి ఓ ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపాల్ కటకటాల పాలయ్యాడు.
కావలిలోని ఒక కార్పొరేట్ పాఠశాలకు ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న చింతగుంట సాయిసుధీర్ విద్యార్థుల నుంచి వసూలు చేసిన ఫీజులు రూ. 6,60,000 లతోపాటు, విద్యార్థుల తల్లిదండ్రులు, అదే స్కూలులోని ఉపాధ్యాయుల వద్ద అప్పులు చేసి మరో రూ.13 లక్షలు తీసుకున్నారు. ఈ మొత్తం రూ.19,60,000 లతో ఉడాయించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే...
గుంటూరు జిల్లా తెనాలికి చెందిన చింతగుంట సాయిసుధీర్ రెండేళ్ల కిందట నెల్లూరు జిల్లా కావలిలోని ట్రంకురోడ్డులో ఉన్న ఓ కార్పొరేట్ పాఠశాలలో ప్రిన్సిపాల్గా చేరాడు. అప్పటి నుంచి యాజమాన్యం తోపాటు విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో బాగా సఖ్యతగా ఉంటూ నమ్మకాన్ని ఏర్పరుచుకున్నారు. దీంతో పాఠశాలలో విద్యార్థుల నుంచి వసూలు చేసిన ఫీజులను తన వద్దే ఉంచుకుంటూ వచ్చాడు. అతడిపై నమ్మకంతో వెంటనే జమ చేయలేదేమని ఎవరూ ప్రశ్నించలేదు.
ఈ క్రమంలో ఇతడు ఇలాగే పలువురు విద్యార్థుల తల్లితండ్రులు, ఉపాధ్యాయుల నుంచి కూడా అప్పులు తీసుకుంటూ ఉన్నాడని తెలిసింది. అప్పు తీర్చాల్సిందిగా ఒకరు గట్టిగా నిలదీయడంతో అప్పటివరకు వసూలు చేసిన సొమ్ముతో ఈ ప్రిన్సిపల్ ఉడాయించాలనే ప్రయత్నాల్లో ఉన్నాడు. అయితే దీన్ని యాజమాన్యం పసిగట్టి ఆ ప్రిన్సిపాల్ను పోలీసులకు అప్పగించి ఫిర్యాదు చేసింది. దీంతో ఎస్ఐ అంకమ్మ ఆయనను అరెస్ట్చేసి కోర్టులో హాజరు పరిచారు.