మంత్రివర్గ సమావేశంలో... అన్నీ చర్చించారు సరే... అసలు విషయం ఊసే లేదేంటీ?
Recommended Video
అమరావతి: అమరావతి సచివాలయంలో బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు, అనేక కీలక అంశాలపై చర్చ జరిగింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కేబినెట్ మీటింగ్ అనగానే తాజా పరిస్థితులకు సంబంధించి కూడా చర్చ జరుగుతుందని, తదనుగుణంగా నిర్ణయాలు...ప్రకటనలు ఉంటాయని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు.అయితే కారణాలేమైనా కానీ రాష్ట్రాన్ని ఇంతగా కుదిపేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరి పట్ల అంత ముఖ్యమైన మంత్రిమండలి సమావేశంలో చర్చ కాదు కదా!...కనీసం ప్రస్తావన కూడా లేదు...
తాజా రాజకీయ పరిస్థితులు ఏమాత్రం పట్టనట్లు...అంతా...మామూలు గానే ఉన్నట్లు...అసలేమీ జరగనట్లు ఎప్పటిలాగానే మూసలో మీటింగ్ కానిచ్చేసిన ఎపి కేబినెట్ సమావేశం రాష్ట్ర ప్రజలను ఉసూరుమనిపించింది. ఇంత కీలక తరుణంలో జరుగుతున్న అంతటి ప్రాముఖ్యమైన సమావేశంలో ముఖ్యమంత్రి కాని, మంత్రి వర్గ సహచరులు కానీ...కనీసం ఆ ఊసు కూడా ఎత్తకపోవడానికి కారణం ఏమిటి?...ఆ కారణం ప్రజలకు సంబంధించిందా? లేక పార్టీ ప్రయోజనాలకు సంబంధించిందా?...ఏమైతేనే ప్రజల మనోభావాలను మాత్రం పాలకులు పట్టించుకోవడం లేదన్న సంకేతాలను ఈ సమావేశం చాలా స్పష్టంగా ఇచ్చేసింది.
ఇవీ క్యాబినెట్ మీటింగ్ లో...ముఖ్య నిర్ణయాలు...
బుధవారం సచివాలయంలో సిఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన ఎపి కేబినెట్ మీటింగ్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో ఉద్యోగులకు 2017 నుంచి 2108 మార్చి 31 వరకు 2.096 శాతం డిఎ చెల్లించాలని కేబినెట్ నిర్ణయించింది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ విషయంపై కూడా చర్చించారు. మార్చి 5న రాష్ట్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం, మార్చి 8న బడ్జెట్ ప్రవేశపెట్టాలని గతంలోనే చంద్రబాబు ప్రకటించారు. అయితే కేబినెట్ దీనిపై కూడా చర్చించి నిర్ణయం తీసుకుంది.పోలవరం ప్రాజెక్టులో కాంక్రీట్ పనులు చేపట్టిన సవయుగ సంస్థకు రూ.1244 కోట్ల పరిపాలన అనుమతులకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎసిబిలో 350 పోస్టులు, గన్నవరం కోర్టులో 25 పోస్టుల భర్తీకి కూడా మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. అంతేకాకుండా వివిధ సంస్థలకు భూ కేటాయింపులకు సంబంధించి కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇవన్నీ సరే...మరి అసలు సంగతి ప్రస్తావన ఏది?...
అయితే ఈ సమావేశంలో ప్రస్తుతం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విభజన హామీల ప్రస్తావన గానీ, చర్చ గాని చెయ్యలేదెందుకు?...ఇప్పుడు ఈ చర్యే...అన్ని విధాలా రాష్ట్ర ప్రజలను తీవ్రంగా నిరాశపర్చింది. ఈ విషయం గురించి కనీసం కేబినెట్ మీటింగ్ ఊసు కూడా ఎత్తకపోవడాన్ని ప్రజలు ఎలా అర్ధం చేసుకోవాలి?...అంటే కేంద్రం ఈ చివరి యూనియన్ బడ్జెట్ లో సైతం రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులు చెయ్యకపోవడంతో పరిస్థితి అర్ధం చేసుకొని తదనుగుణంగా మన బడ్జెట్ లో మార్పులు చేర్పులు చెయ్యడం లాంటి సునిశిత చర్యలు మన పాలకులు చేపడతారనే అత్యాశ లాంటిది ఏదీ లేదు కాని...కనీసం తాజా రాజకీయ పరిస్థితులు...ప్రజల మనోభావాల గురించి ఒక చర్చ...ఇలా వుంది...ఏం చేద్దాం...ఎలా ముందుకెళదామనే ప్రస్తావన అయినా చెయ్యకపోవడాన్ని..చెయ్యాలన్న ఆలోచన లేకపోవడాన్ని జనం ఎలా అర్ధం చేసుకోవాలి?...
ప్రజల మనోభావాలతో పని లేదా?...లేక మనల్నెందుకు పట్టించుకుంటారనుకున్నారా?..
రాష్ట్రం పట్ల కేంద్రం వైఖరి నేపథ్యంలో ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయి?...అనేది తెలియడం లేదా? లేక వాళ్ల మనోభావాలతో పని లేదా?...లేక...ఈ రెండు కాకుండా...అసలు ప్రజలు మన క్యాబినెట్ మీటింగ్ లో చర్చని, చర్యలని పట్టించుకోరు అనుకున్నరా?...లేక వాళ్లేమనుకుంటే మనకెందుకు అనుకున్నరా?...ఇక ముందు కూడా ఇంతేనా?...ఏ విషయమైనా అంతేనా?...ఇవన్నీ ఇప్పుడు ప్రజల్లో మెదులుతున్న ప్రశ్నలు...ఇంతకాలం పాలకులు చెప్పిన ప్రతి కారణాన్ని విని ఊరుకున్న ప్రజలు ఇప్పుడు రాష్ట్రం నష్టపోతుందని స్పష్టంగా తెలిసి పట్టించుకోకుండా అంటారని...పట్టించుకోవడం లేదనుకుంటే...చాలా పొరపాటు...సాంకేతిక విప్లవం వెల్లువలా విస్తరించిన ఈ కాలంలో ప్రతి విషయం ప్రజలకు చేరిపోతోంది...ప్రతి కదలిక వారికి కనిపిస్తోంది. రాజకీయాలతో పాటు ప్రజల మనోభావాలను కాస్తయినా పట్టించుకోకుంటే...అలా చేసిన ఎవరైనా భారీ మూల్యమే చెల్లించాల్సి ఉంటుంది.
ఎందుకు ప్రస్తావించలేదు?..భయమా?...ఎందుకు?...ఎవరంటే?..
ఇంతకూ కేబినెట్ మీటింగ్ లో రాష్ట్రానికి జరిగిన, జరుగుతున్న అన్యాయాన్ని గురించి ఎందుకు ప్రస్తావించలేదు...కేంద్రం బడ్జెట్ కేటాయింపుల్లో కానీ...విభజన హామీల నెరవేర్చే విషయంలో గానీ...ప్రత్యేక హోదా విషయంలో గాని...ఎపి పట్ల చూపిస్తున్న వివక్ష గురించి ఎందుకు చర్చించలేదు...అనవసరం అనుకుంటే...ఎందుకు అనవసరం?...ఎలా అనవసరం?...ఒకవేళ రిస్క్ అనుకుంటే ఎందుకు రిస్క్?...ఎవరికి రిస్క్?...మంత్రివర్గంలో బిజెపి సభ్యులు ఉన్నారు కాబట్టి...తామేదైనా చర్చిస్తే అది వాళ్ల ద్వారా కేంద్రానికి చేరితే ఇబ్బందవుతుంది కాబట్టి?...అంతేనా?...
అదేనా కారణం...ఆ మంత్రి గారు ఎంత పనిచేశారు?
అదా రిస్క్...మరయితే ప్రజలు నొచ్చుకుంటే...ఫరవాలేదా?...అయినా క్యాబినెట్లో ఉన్న ఇద్దరు బిజెపి మంత్రుల్లో ఒకరైన కామినేని శ్రీనివాస్ ఆల్రెడీ చంద్రబాబుకే అనుకూలంగా ఉంటారనే విషయం అందరికీ తెలిసిందే...ఆయన అటు నుంచి సమాచారం ఇటు తేవడమే తప్ప ఇటు నుంచి చంద్రబాబుకు, టిడిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అటు చేరవేసేది ఏమీ ఉండదని కూడా అందరికీ అర్ధమైపోయింది. ఇక మరో మంత్రి పైడికొండల మాణిక్యాలరావు...ఈయనకేమైనా భయపడ్డారా?...కరెక్టేనేమో...ఈయనకే భయపడి ఇలా చేసుండొచ్చు...ఎందుకంటే ఈ మంత్రి ఈమధ్య కాలంలో టిడిపి మీద, చంద్రబాబు మీద విమర్శలతో చెలరేగిపోతున్నారు...అసలే తాజా రాజకీయ పరిస్థితుల్లో...అనేక సెల్ఫ్ గోల్స్ నేపథ్యంలో...కేబినెట్ మీటింగ్ లో ఏమంటే ఏం తంటా వస్తుందో...ఏం మాట్లాడితే ఏం ముప్పు ముంచుకొస్తుందో..వాటిని ఈ మంత్రి మిగిలిన బిజెపి నేతలకు, కేంద్రానికి చేరవేస్తారేమో అని భయపడ్డారా?...ఖచ్చితంగా ఇదే కారణం అనిపిస్తోంది...ప్రజల మనోభావాల్ని తోసిరాజని...రాష్ట్రం ప్రజలకు సంబంధించిన అతి ముఖ్యమైన అంశాల్ని గురించి మంత్రి వర్గంలో ప్రస్తావించకపోవడానికి కారణం అదే అయితే...పైడికొండల మాణిక్యాలరావు ఎంత పనిచేశారు?...సరే..ఇప్పటికైనా ప్రజాభిప్రాయాన్ని గమనించి...సర్ధుబాటో..దిద్దుబాటో చర్యలు చేపట్టండి...లేకుంటే...మరింత నష్టం...తద్వారా చెల్లించక తప్పదు భారీ మూల్యం.