కడప సెంట్రల్ జైలు వద్ద ఖైదీ పరారీ, అద్దెకార్లపై రవాణా శాఖ అధికారుల దాడులు
హైదరాబాద్: కడప సెంట్రల్ జైలులోకి వెళుతున్న క్రమంలో ఓ ఖైదీ పరారయ్యాడు. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన సునీల్ అనే ఖైదీ పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్నాడు. అనంతపురం జిల్లా నుంచి అతడిని పోలీసులు కడప కేంద్ర కారాగారానికి తరలిస్తున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
తప్పించుకున్న ఖైదీ సునీల్ కోసం పోలీసులు గాలింపును ముమ్మరం చేశారు. జార్ఖండ్లోని చాయ్బసా కేంద్ర కారాగారం వద్ద మూడు రోజుల క్రితం సరిగ్గా ఇలాంటి సంఘటనే జరిగింది. ఈ ఘటనలో విచారణలో ఉన్న ఐదుగురు ఖైదీలు పోలీసులు కాల్పుల్లో మృతి చెందగా, 17 మంది ఖైదీలు తప్పించుకు పారిపోయిన విషయం తెలిసిందే.
అద్దెకార్లపై దాడులు జరిపిన ఏపీ రవాణా శాఖ
దేశ రాజధాని ఢిల్లీలో క్యాబ్లో ప్రయాణించిన మహిళపై అత్యాచారం జరిగిన ఘటనతో ఆంధ్రప్రదేశ్లో రవాణాశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా నిబంధనలు ఉల్లంఘించి నడుపుతున్న అద్దెకార్లపై దాడులు నిర్వహించారు.
గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి సహా ప్రధాన నగరాల్లో అద్దెకార్లను విస్తృతంగా తనిఖీ చేశారు. నిబంధనలను పాటించకుండా ప్రయాణీకులను తరలిస్తున్న 73 అద్దె వాహనాలపై కేసులు నమోదు చేసి, 5 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.