లక్ష్మీ... నన్ను క్షమించు!.. అందుకే చనిపోతున్నా.. సోషల్ మీడియాలో...సూసైడ్ వీడియో కలకలం...
ప్రకాశం జిల్లా: అతడో ఉద్యోగి...సోమవారం ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఆయన ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నారని తొలుత అందరూ భావించారు. కానీ ఆయన తాను ఎందుకు చనిపోతున్నాడో తన ఆత్మహత్యకు ముందు స్వయంగా రికార్డు చేసిన వీడియో ద్వారా వెల్లడైంది. ఒక రోజు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారి కలకలం రేపుతోంది.
ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఈదుమూడిలోని కొండ్రగుంట సుబ్బరత్తమ్మ శీతల గిడ్డంగిలో సూపర్ వైజర్ గా పనిచేస్తున్న మన్నె శేషేంద్రకుమార్ అనే ఉద్యోగి విషాదాంత గాథ ఇది...రైతుల వద్ద యజమాని సరుకు కొనుగోలు చేశాక అతడిచ్చే డబ్బును రైతులకు ఇవ్వడమే శేషేంద్రకుమార్ కోల్డ్ స్టోరేజ్ లో చేసే పని. అయితే కొంతకాలంగా యజమాని సరుకు కొనుగోలు చెయ్యడమే కాని డబ్బులు ఇవ్వక పోవడంతో తాను కూడా రైతులకు తిరిగి చెల్లించలేదు. దీంతో రైతులు ఇతడిని అనుమానించారు...తప్పు చేసిన వాడిలా చూశారు...అది తట్టుకోలేక...తనకు రావాల్సిన నగదు రాక...తాను ఇవ్వాల్సిన వారికి ఇవ్వలేక... మనోవేదనతో ఆ ఉద్యోగి సోమవారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు...
వీడియో బైటపడి...సోషల్ మీడియాలో వైరల్...అసలు కారణాలు...
ప్రకాశం జిల్లాలో కలకలం రేపిన కోల్డ్ స్టోరేజ్ ఉద్యోగి శేషేంద్రకుమార్ బలవన్మరణం వెనుక ఉన్న కారణాలు ఆయనే స్వయంగా రికార్డు చేసుకున్న వీడియోతో బయటకు వచ్చాయి. కానీ ఆయన మరణానికి అసలు కారణం తాను పనిచేస్తున్నశీతల గిడ్డంగి యజమాని ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఆపేయడమేనని ఆయనే చిత్రీకరించిన వీడియో మంగళవారం బైటపడటం, సోషల్ మీడియాలో వైరల్ గా మారడం సంచలనం సృష్టించింది.
ఆ వీడియోలో...లక్ష్మీ నన్ను క్షమించు...పిల్లలు జాగ్రత్త...
ఆ వీడియోలో ఏముందంటే...‘మా యజమాని నుంచి రూ. 40 లక్షలు రావాలి...నాలుగేళ్ల జీతం రూ. 20 లక్షలు రావాలి. మహేష్ నుంచి శనగలు ఇచ్చిన డబ్బులు రూ. కోటి రావాలి. నన్ను అందరూ మోసం చేశారు. నాకు ఇవ్వాల్సిన వాళ్లుఇవ్వడం లేదు. నాకు వాళ్లు ఇస్తే, నేను రైతులకు ఇస్తే ఇక బాకీలు ఉండవు. కానీ నన్ను జనం దొంగలా చూశారు. నాకు ఒకరి సొమ్ము తినాల్సిన అవసరం లేదు. నా భార్యాబిడ్డలను ఎలా చూసుకోవాలో అర్థం కావడం లేదు. లక్ష్మీ నన్ను క్షమించు. నా యజమాని నాకు డబ్బులు ఇవ్వడు. అందుకే నాకు వేరే దారి లేదు. నన్ను క్షమించు, పిల్లలు జాగ్రత్త...' అంటూ ఆ వీడియోలో శేషేంద్ర కుమార్ మాట్లాడారు.
వీడియో చూడటంతో...మృతుడి భార్య, రైతుల ధర్నా...
శేషేంద్ర రికార్డు చేసిన వీడియో, శేషేంద్ర డైరీలోని రాతలు చూసిన రైతులు మంగళవారం ఉదయం శీతల గిడ్డంగి ముందు ఆందోళన చేశారు. బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ ధర్నా చేశారు. కేవలం గిడ్డంగి యాజమాన్యం మోసం చేయడం వల్ల ఓ నిండు ప్రాణం బలైందని ఆందోళన చేశారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. శేషేంద్ర భార్య నాగవెంకటలక్ష్మి తన ఇద్దరు ఆడపిల్లలు, బంధువులతో కలిసి ఆందోళన చేశారు.
ఆందోళన విరమించేది లేదు...పత్తా లేని గిడ్డంగి యజమాని
శేషేంద్ర కుమార్ మృతదేహాన్నికోల్డ్ స్టోరేజ్ ఎదుట అంబులెన్సులోనే ఉంచి రహదారిపై బైఠాయించారు. గిడ్డంగి యజమాని కొండ్రగుంట శ్రీనివాసరావు ఎప్పటికీ రాకపోవడంతో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆయన వచ్చి సమాధానం చెప్పే వరకు, బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించబోమంటూ నినదించారు.
పోలీసులు రాక...న్యాయం చేస్తామని హామీ...
అయితే ఆందోళన ఉద్రిక్తతకు దారితీస్తూ పరిస్థితులు చేయి దాటుతుండడంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. గ్రామీణ సీఐ మురళీకృష్ణ, ఎస్సై, సిబ్బందితో సహా చేరుకుని రైతులు, బాధితుడి బంధువులతో చర్చించారు. శాంతియుతంగా మాట్లాడుకోవాలని, బాధితుడి కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు ఆందోళనను విరమించి, సాయంత్రం మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, శేషేంద్ర ఆత్మహత్యకు పరోక్షంగా కారణమైన వారిపైనా కేసు నమోదు చేస్తామని ఎస్పీ సత్యఏసుబాబు ఈ సందర్భంగా తెలిపారు.