లాంచీ వెలికితీతలో తొలి ప్రయత్నం విఫలం..ఇక ప్లాన్ బీ: 144 సెక్షన్ విధింపు
కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరి నదిలో మునిగిన పర్యాటక లాంచీ రాయల్ వశిష్ఠను వెలికి తీయడంలో తొలి ప్రయత్నం విఫలమైంది. లాంచీ లంగరు కొక్కేనికి ఇనుప తాళ్లను కట్టి జేసీబీలతో లాంచీని నదీ గర్భం నుంచి వెలికి తీయాలని మొదట భావించినప్పటికీ.. అది విరిగి పోయే ప్రమాదం ఉందని భావించారు. ఆ ప్రయత్నం నుంచి విరమించుకున్నారు. ఇక ప్లాన్-బీ సిద్ధం చేశారు. లాంచీ చుట్టూ తాళ్లను కట్టి దాన్ని బయటికి లాగాలని నిర్ణయించుకున్నారు. మంగళవారం ఉదయం ఈ పనులు ప్రారంభం కానున్నాయి.
బురదలో చిక్కుకున్న లాంచీ
కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిన లాంచీ నదీ గర్భంలో 310 అడుగుల లోతుకు చేరుకున్న విషయం తెలిసిందే. జాతీయ విపత్తు నిర్వహణ బలగాలు గానీ, నౌకా దళానికి చెందిన సాంకేతిక నిపుణులు గానీ ఈ లాంచీని వెలికి తీయడానికి చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. దీనితో తూర్పు గోదావరి జిల్లా అధికారులు ఈ పనులను కాకినాడకు చెందిన బాలాజీ మెరైన్స్ సంస్థకు అప్పగించారు. ధర్మాడి సత్యానికి చెందిన సంస్థ ఇది. సుమారు 23 లక్షల రూపాయల వర్క్ ఆర్డర్ ను పొందిన ధర్మాడి సత్యం సోమవారం లాంచీ వెలికి తీత పనులను ఆరంభించారు. లాంచీ ఎర్రమట్టి బురదలో చిక్కుకుని ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.
వెలికితీత ఇలా..
బాలాజీ మెరైన్స్ సంస్థకు చెందిన 25 మంది నిపుణులు, గజ ఈతగాళ్లు సోమవారం లాంచీ వెలికితీత పనులను ప్రారంభించారు. దీనిి అవసరమైన సామాగ్రిని నదీ ఒడ్డుకు తరలించారు. భారీ ఇనుప తాళ్లు, లంగర్లతో గోదావరిలోకి వెళ్లి ప్రమాదం చోటు చేసుకున్న స్థలంలో గాలించారు. భారీ ఇనుప కొక్కేలు, ఇనుప తాళ్లను పంటు ద్వారా గోదావరిలోకి వదిలారు. దాన్ని నదీ ఒడ్డున ఉంచిన జేసీబీలకు కట్టారు. పంటు ద్వారా గోదావరి లోపలికి లంగర్లను దించి.. ప్రమాదం చోటు చేసుకున్న స్థలం నుంచి కిలోమీటర్ దిగువ వరకు గాలించారు. లంగర్లను సుమారు 275 నుంచి 325 అడుగుల లోతు వరకు పంపించారు.
లంగర్లకు లాంచీ చిక్కుకుంటేనే..
లంగర్లకు లాంచీ చిక్కుకున్న తరువాతే ముందుడుగు వేసే అవకాశాలు ఉన్నాయి. అప్పటిదాకా లాంచీ కోసం అన్వేషణ తప్పకపోవచ్చని ధర్మాడి సత్యం తెలిపారు. లంగర్లకు లాంచీ తగిలితే.. ఆ ప్రదేశం లోతును అంచనా వేసి, దానికి అనుగుణంగా తమ వ్యూహాన్ని అమలు చేస్తామని అన్నారు. లంగరు కొక్కేనికి తాడును కట్టాలని ఆలోచనను విరమించామని, అందుకే లాంచీ మొత్తానికీ తాడును కట్టి బయటికి లాగుతామని చెప్పారు. లాంచీ బురదలో చిక్కుకుని ఉండే అవకాశాలు లేకపోలేదని, అందుకే దాన్ని గట్టిగా లాగితే లంగరు కొక్కెం తెగిపోవచ్చని అన్నారు.
144 సెక్షన్ విధింపు..
లాంచీ వెలికితీత ప్రాంతం సహా కచ్చులూరు గ్రామం తీరంలో 144 సెక్షన్ విధించారు జిల్లా పోలీసులు. పర్యాటకులు గానీ సందర్శకులు గానీ పెద్ద సంఖ్యలో సంఘటనాస్థలానికి చేరుకుంటే లాంచీ వెలికితీత పనులకు విఘాతం కలుగుతుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా- తొలిరోజు కొందరు పోలీసులు, దేవీపట్నం రెవెన్యూ అధికారులు, బాలాజీ మెరైన్స్ సిబ్బంది తప్ప పెద్దగా సందడి కనిపించలేదు. లాంచీ వెలికి తీత కొనసాగినన్ని రోజులూ 144 సెక్షన్ అమలులో ఉంటుందని పోలీసులు వెల్లడించారు. వెలికితీత పనులను చూడ్డానికి ఎవరూ రావొద్దని వారు సూచించారు.