ఇంధనం ఖాళీ: వెంకయ్యను మరోమారు భయపెట్టిన విమానం!
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడును ఓ విమానం మరోమారు భయపెట్టింది. ఇప్పటికే పలుమార్లు విమాన ప్రమాదాల నుంచి తృటిలో తప్పించుకున్న వెంకయ్య.. సోమవారం ఢిల్లీలో జరిగిన ఘటనతో మరోమారు షాకయ్యారు.
వివరాల్లోకెళితే.. రాజ్యసభ సభ్యత్వం కోసం రాజస్థాన్ నుంచి నామినేషన్ వేసేందుకు సహచర మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీతో కలిసి ఆయన సోమవారం ఢిల్లీ నుంచి జైపూర్ కు చార్టెర్డ్ ఫ్లైట్ ఎక్కారు. వెంకయ్య ఎక్కిన విమానం బయలుదేరేందుకు సిద్ధమైంది. రన్ వేపై పరుగులు పెట్టడం ప్రారంభించింది. అంతలోనే ఉన్నట్టుండి విమానం ఆగిపోయింది.
విమానంలో ఇంధనం అయిపోయినట్లు సంకేతం రావడాన్ని గమనించిన పైలట్ వేగంగా స్పందించాడు. క్షణాల్లో టేకాఫ్ తీసుకోవాల్సిన విమానాన్ని అతడు వెనక్కు తిప్పాడు. ఆ తర్వాత విషయం తెలుసుకున్న వెంకయ్య, రూడీ విమానం దిగేశారు. మరో విమానం కోసం అక్కడే వెయిట్ చేశారు.
దాదాపు రెండు గంటల తర్వాత వారిద్దరూ మరో విమానంలో ఈ ఇద్దరు మంత్రులు జైపూర్ బయలుదేరారు. అసలే నామినేషన్ వేసేందుకు వెళుతున్న వెంకయ్య ప్రయాణం ఆలస్యమవడంతో గాబరా పడ్డ రాజస్థాన్ సీఎం వసుంధర రాజే విషయం తెలుసుకుని ఎయిర్ పోర్టుకే నామినేషన్ పత్రాలు తీసుకుని వచ్చారు.
ఎయిర్ పోర్టులోనే వాటిపై సంతకాలు పెట్టిన వెంకయ్య అక్కడి నుంచే నేరుగా రాజస్థాన్ అసెంబ్లీకి బయలుదేరారు. నామినేషన్ వేసిన తర్వాత వెంకయ్యనాయుడు తిరిగి ఢిల్లీ వెళ్లారు. కాగా, మంగళవారం నామినేషన్ల గడువు ముగియనుంది.