మోడితో సన్నిహితంగా ఉంటారు, ఆ పని చేయలేరా?: వెంకయ్యకు కేవీపీ లేఖ
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, ఏపీకి ప్రత్యేకహోదా కల్పించాలని కోరుతూ రాజ్యసభలో తాను ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుకు ఎంపీ కేవీపీ రామచంద్రరావు తన వంతు ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
ఇందులో భాగంగా ఆయన శనివారం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడికి లేఖ రాశారు. ప్రధాని నరేంద్రమోడీతో సన్నిహితంగా ఉండే వెంకయ్య నాయుడు ఏపీకి ప్రత్యేకహోదా ఇప్పించాలని ఆ లేఖలో పేర్కొన్నారు. విభజన చట్ట ప్రకారం ఆంధ్రప్రదేశ్కు న్యాయం చేయాలని ఆయన కోరారు.
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా కల్పించాలని ఆనాటి ప్రధాని పార్లమెంట్ సాక్షిగా ప్రకటన చేస్తే ఆ ప్రకనటకే విలువ లేదంటున్నారని ఎంతో ఆవేదన వెలిబుచ్చారు. రాష్ట్ర విభజన జరిగిన సమయంలో ఆనాడు అనేక సవరణలను ప్రతిపాదించి ఉపసంహరించుకున్నారని ఆయన గుర్తు చేశారు.
పోలవరం ముంపు మండలాలు, రెవెన్యూ పంపకాలు, ఏపీ అభివృద్ధి చర్యలపైనా విభజన చట్టంలో పొందుపరిచాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. అయితే వాటన్నింటిని ఉపసంహరణ విషయం ప్రజలకు తెలియకపోవడం విశేషమని చెప్పుకొచ్చారు.
విభజన సమయంలో ఇచ్చిన ప్రత్యేక హోదా సహా ఇతర హామీలు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. రెండుమూడు నెలల్లో అధికారంలోకి వస్తామని, హామీలన్నీ అమలు చేసే బాధ్యత తీసుకుంటామని ఆనాడు రాజ్యసభలో వెంకయ్య చేసిన ప్రకటనను లేఖలో గుర్తుచేశారు.
ఆ సవరణలు ఆమోదిస్తే బిల్లు స్వరూపం మారుతుందని, మళ్లీ లోక్సభ ఆమోదం పొందాల్సి ఉంటుందని దానిని ఉపసంహరించుకున్నారని తెలిపారు.
అయితే ఇప్పుడు విభజన చట్టంలో ఏపీకి ప్రత్యేకహోదా అంశం అందులో ప్రస్తావించలేదని అనడం సరికాదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పిస్తూ తాను ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుకు ఎన్టీఏ ఎంపీలు ఓటు వేసేలా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇదే విషయమై టీడీపీ మద్దుతు కోరుతూ మూడు రోజుల క్రితం చంద్రబాబుకు కేవీపీ లేఖ రాశారు.