నాడు తెల్ల ఏనుగు- నేడు సంజీవని-వైజాగ్ స్టీల్కు సర్వత్రా ప్రశంసలు-చిరు ట్వీట్
దేశవ్యాప్తంగా కోవిడ్ కల్లోలం రేపుతోంది. లక్షల సంఖ్యలో కేసులతో ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. పలు రాష్ట్రాల్లో ఆక్సిజన్ నిల్వలు నిండుకోవడంతో సీఎంలే హాహాకారాలు చేస్తున్న పరిస్ధితి. ఇలాంటి సమయంలో నేనున్నానంటూ ముందుకొచ్చింది విశాఖ స్టీల్ ప్లాంట్. నిన్న మొన్నటి వరకూ కేంద్రం ప్రైవేటీకరణ చేస్తామని బెదిరించిన స్టీల్ ప్లాంట్ ఇప్పుడు దేశంలో లక్షల ప్రజల్ని ఆదుకుంటోంది. నిత్యం ఇక్కడి నుంచి పదుల సంఖ్యలో ట్యాంకర్లు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నాయి. దీంతో సెలబ్రిటీలు సైతం ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
నిన్నటివరకూ తెల్ల ఏనుగు
నిన్న మొన్నటివరకూ నష్టాల బాటలో ఉండి కేంద్రం ప్రైవేటీకరణ చేసేందుకు ఇప్పుడా, అప్పుడా అని ఎదురుచూసిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ను కాపాడుకునేందుకు కార్మికులు రోడ్డెక్కారు. ఉద్యమాలు చేశారు. రాజకీయ నేతలు అవసరాల కొద్దీ ప్రకటనలు చేశారు. కేంద్రానికి లేఖలు రాశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకపోతే మూసివేతే దిక్కవుతుందని కేంద్రం బెదిరింపులకు దిగింది. అయినా ఏపీ ప్రభుత్వం ఏమీ చేయలేని పరిస్ధితి. కానీ నెల రోజుల్లోనే పరిస్ధితి పూర్తిగా మారిపోయింది.
ఆక్సిజన్ కోసం పెద్దదిక్కుగా మారిన స్టీల్ ప్లాంట్
నిన్న మొన్నటి వరకూ స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తి చేసే ఉక్కుకే దిక్కులేదు. అలాంటిది ఇక్కడ తయారయ్యే ఆక్సిజన్ను ఎవరు కొంటారని అంతా ప్రశ్నించారు. కేంద్రం మాట కూడా ఇదే. మంచి టైమ్ చూసి స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు శక్తులకు కట్టబెట్టేందుకు చేయని ప్రయత్నం లేదు. అలాంటింది ఇప్పుడు కరోనా ఒక్కసారిగా విజృంభించడంతో స్టీల్ ప్లాంట్ అందరికీ పెద్ద దిక్కుగా మారిపోయింది. మిగతా రాష్టాలు సైతం ఇక్కడి నుంచి ఆక్సిజన్ కోసం క్యూ కట్టే పరిస్ధితి. కేంద్రమైతే ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ పేరుతో ప్రత్యేక రైళ్లు నడిపి మరీ ఇక్కడి ఆక్సిజన్ను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న పరిస్దితి.
క్యూ కడుతున్న ఆక్సిజన్ ఎక్స్ప్రెస్లు
కరోనా కల్లోలం వేళ వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి భారీ ఎత్తున ఉత్పత్తి అవుతున్న ఆక్సిజన్ను ఇతర రాష్ట్రాలకు అందించేందుకు కేంద్రం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఖాళీ ట్యాంకర్లను విశాఖకు పంపి మరీ ఆక్సిజన్ను సేకరిస్తోంది. ఇలా ఆక్సిజన్ తీసుకెళ్లేందుకు పంపుతున్న రైళ్లకు ఆక్సిజన్ ఎక్స్ప్రెస్లుగా నామకరణం చేసింది. దీంతో ఇప్పుడు విశాఖకు ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ల తాకిడి పెరిగింది. నిత్యం పదుల సంఖ్యలో ఖాళీ ట్యాంకర్లను తీసుకొచ్చి ఇక్కడి ఆక్సిజన్ను ఇవి నింపుకెళ్తున్నాయి.
చిరంజీవి సహా సెలబ్రిటీల ప్రశంసలు
నిన్న మొన్నటివరకూ ప్రైవేటీకరణ చేద్దామనుకున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇప్పుడు ఆక్సిజన్ సరఫరాతో కరోనా రోగులకు సంజీవనిగా మారిపోవడంపై సెలబ్రిటీలు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దేశమంతా కష్టాల్లో ఉన్న కరోనా రోగులకు ఆక్సిజన్ అందిస్తున్న స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయాలనుకోవడం ఎంత వరకూ సమంజసం అంటూ చిరంజీవి పెట్టిన ట్వీట్ వైరల్ అవుతోంది. అలాగే కేంద్రానికి ఆయన వేసిన ప్రశ్న తాజా పరిస్ధితికి అద్దం పట్టేలా ఉంది.
Let us THINK.. #VizagSteelPlant #OxygenForIndia pic.twitter.com/6MjSKp7jVB
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 22, 2021