అనిత ఇష్యూ: రోజా పొంతనలేని జవాబులు, అసెంబ్లీకి డుమ్మా.. అందుకే
రోజా సభలో ఉండగానే నివేదికపై చర్చ చేపట్టి నిర్ణయం తీసుకోవడం సబబనే అభిప్రాయాన్ని ఎక్కువ మంది ఎమ్మెల్యేలు వ్యక్తం చేశారు. దీంతో కమిటీ నివేదిక ఇచ్చినా రోజా గైర్హాజరు కారణంగా ఈ రోజు దీనిపై చర్చ జరగలేదు.
అమరావతి: వైసిపి నగరి ఎమ్మెల్యే రోజాపై పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు సభాహక్కుల కమిటీ గురువారం తమ నివేదికను శాసనసభకు ఇచ్చింది. గొల్లపల్లి సూర్యారావు ఛైర్మన్గా ఉన్న ఈ కమిటీలో నందమూరి బాలకృష్ణ, శ్రవణ్ కుమార్, జ్యోతుల నెహ్రూలు సభ్యులుగా ఉన్నారు.
గత ఏడాది అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై సభలోనే స్పీకర్కు ఎమ్మెల్యే వంగలపూడి అనిత ఫిర్యాదు చేశారు. అనిత ఫిర్యాదుపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని స్పీకర్ కోడెల కమిటీని ఆదేశించారు.
ఫిర్యాదుపై విచారణ చేపట్టిన కమిటీ మూడుసార్లు రోజాను హాజరుకావాలని సమాచారం పంపినా ఆమె గైర్హాజరయ్యారు. రోజా హాజరుకాకపోవడాన్ని తీవ్రంగా పరిగణించిన కమిటీ ఆమెపై ఎలాంటి చర్య అయినా తీసుకునే అధికారం సభకు ఉందంటూ గతంలో నివేదిక సమర్పించింది.
అదే సమయంలోనూ తాను అనారోగ్యం కారణంగా కమిటీ ముందుకు హాజరు కాలేకపోయానని అసెంబ్లీ కార్యదర్శికి రోజా లేఖ పంపించారు. కమిటీ ముందు హాజరయ్యేందుకు ఆమెకు మరో అవకాశం కల్పించాలని స్పీకర్ సూచించారు.
ఆ తర్వాత రోజా కమిటీ ముందు హాజరై వాదనలు వినిపించారు. ఈ విచారణకు సంబంధించి పూర్తి వివరాలను కమిటీ సభ్యులు నివేదికలో పేర్కొన్నారు. రోజా ఎక్కడా బేషరతుగా క్షమాపణ చెప్పడానికి సిద్ధపడలేదని కమిటీ పేర్కొంది.
వివిధ సందర్భాల్లో పొంతనలేని భిన్న సమాధానాలు చెప్పారని స్పీకర్కు ఇచ్చిన నివేదికలో పేర్కొంది. కమిటీ నివేదిక ఇచ్చిన ఈ రోజు రోజా సభకు హాజరుకాకపోవడం అసెంబ్లీ వర్గాల్లో చర్చ జరిగింది.
రోజా సభలో ఉండగానే నివేదికపై చర్చ చేపట్టి నిర్ణయం తీసుకోవడం సబబనే అభిప్రాయాన్ని ఎక్కువ మంది ఎమ్మెల్యేలు వ్యక్తం చేశారు. దీంతో కమిటీ నివేదిక ఇచ్చినా రోజా గైర్హాజరు కారణంగా ఈ రోజు దీనిపై చర్చ జరగలేదు. రోజాపై ఏడాది పాటు సస్పెన్షన్ విధించాలని, సస్పెన్షన్ తేదీ నిర్ణయాన్ని శాసనసభకే వదిలేస్తూ కమిటీ నివేదికలో స్పష్టం చేసింది.
వైయస్పై దూళిపాళ్ల
కేవలం కమీషన్ల కోసమే ఆనాడు వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిందని, ట్రాన్స్ట్రాయ్కు తమ ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేదని, గతంలోనే ఆ కంపెనీకి అప్పగించారని టిడిపి నేత దూళిపాళ్ల నరేంద్ర శాసన సభలో అన్నారు.
రాష్ట్రాభివృద్ధికి కీలకమైన ప్రకటన చేసిన కేంద్రానికి ధన్యవాదాలు తెలపాలని నరేంద్ర అన్నారు. ఇలాంటి సంతోష సమయంలో విమర్శలు చేయడం ప్రతిపక్షానికి సరికాదన్నారు.
పోలవరానికి నిధులు, ప్రత్యేక ప్యాకేజీకి కేంద్రం చట్టబద్ధత కల్పించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో చేపట్టిన చర్చలో ఆయన మాట్లాడారు. గతంలో కాల్వలు తవ్వి వచ్చిన డబ్బును దోచుకున్నారన్నారు.