పీఆర్కె కామెంట్: టచ్లో ఆరుగురు టిడిపి ఎమ్మెల్యేలు?
గుంటూరు: తమ పార్టీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయిస్తున్న నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గుంటూరు జిల్లా మాచర్ల శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి (పీఆర్కె) సంచలన ప్రకటన చేశారు. టిడిపికి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు కొద్ది నెలల్లోనే తన ఆధ్వర్యంలో టిడిపిలో చేరుతారని ఆయన అన్నారు.
వారంతా తనతో సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన చెప్పారు. సోమవారంనాడు కన్నెగంటి హనుమంతు వర్ధంతి సందర్భంగా మాచర్ల బస్టాండ్ వద్ద జరిగిన కార్యక్రమానికి హాజరైన ఆయన మీడియాతో కాసేపు మాట్లాడారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉనికి కోల్పోవడంతో ఆందోళన చెంది చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆయన అన్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు టిడిపిలోకి వస్తున్నారంటూ టిడిపి నాయకులు తప్పుడు ప్రచారం సాగిస్తున్నారని ఆయన విమర్సించారు మంత్రి పదవి కోసమో, లేదా అధికార వ్యామోహనంతోనో ఒకరిద్దరు చంద్రబాబుకు మద్దతు పలుకుతారేమో గానీ ప్రజల మద్దతు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డికే ఉందని ఆయన అన్నారు.
ఇది చూసి అధికార పార్టీ ఎమ్మెల్యేలు కొందరు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. డ్వాక్రా మహిళలు, రైతులు, నిరుద్యోగులు చంద్రబాబును నమ్మి నిలువునా మునిగారని, అలాంటిది ఆయనను నమ్ముకుని టిడిపిలో ఎవరు చేరుతారని పిఆర్కె అన్నారు.
ఒకే ఒక ఎంపి, ఒక ఎమ్మెల్యేతో ప్రారంభమైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఇప్పుడు 67 మంది శాసనసభ్యులు, 9 మంది ఎంపీలతో ప్రజల సమస్యలపై నిత్యం పోరాటం చేస్తుందని ఆయన చెప్పారు. ఇకనైనా తప్పుడు ప్రచారాలను మానుకుని ప్రజా సంక్షేమంపై ప్రభుత్వం ఆలోచన చేయాలని ఆయన అన్నారు. లేకపోతే ప్రజలే టిడిపికి బుద్ధి చెబుతారని అన్నారు.