మెడికో సంధ్యారాణి మృతి: ప్రొఫెసర్ లక్ష్మి అరెస్ట్, పోలీసులతో వాగ్వాదం
గుంటూరు: మెడికో పీజీ విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జిజిహెచ్ ప్రొఫెసర్ లక్ష్మిని పోలీసులు అరెస్టు చేశారు. విద్యార్థిని ఆత్మహత్య అనంతరం అజ్ఞాతంలో ఉన్న లక్ష్మిని పోలీసులు కర్నాటకలోని బెంగళూరులో అరెస్టు చేశారు.
ఆమె బంధువుల ఇంటిలో ఉన్నట్లు గుర్తించి అరెస్టు చేసారు. భర్త విజయసారథిని అదుపులోకి తీసుకొని గుంటూరుకు తరలించారు. అరెస్టు సమయంలో పోలీసులతో ఆమె వాగ్వాదం జరిపినట్లుగా తెలుస్తోంది. వైవాహిక సమస్యల కారణంగానే సంధ్యారాణి ఆత్మహత్య చేసుకున్నదని తెలుస్తోంది.
కాగా, సంధ్యారాణి ఆత్మహత్యకు లక్ష్మి కారణమని ఆమెను అరెస్టు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మిర్యాలగూడలో ఉంటున్న సంధ్యారాణి భర్త రవి ఆత్మహత్యాయత్నం చేయడంతో.. పీజీ విద్యార్థులు విధులకు గైర్హాజరై ఆందోళన ఉధృతం చేశారు.
మరోవైపు, గుంటూరు బోధనాస్పత్రిలో గైనకాలజీ ప్రొఫెసర్ లక్ష్మి వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు పిజి విద్యార్థిని సంధ్యారాణి తన డైరీలో తన ఆవేదన తెలిపింది. లక్ష్మి వేధింపుల వల్లే సంధ్యా రాణి ఆత్మహత్య చేసుకున్నట్లు కమిటీ కూడా నిర్ధారించినట్లుగా వార్తలు వచ్చాయి.
అలాంటి మనిషి ఉంటుందని తాను ఊహించలేదని, విద్యార్థులంటే ఆమెకు పురుగులతో సమానమని సంధ్యారాణి తన డైరీలో రాసింది. లక్ష్మి తిట్లు భరించడం తన వల్ల కావడం లేదని, జిజిహెచ్ గైనకాలజీ విభాగం చెడిపోయిందని, ప్రొఫెసర్ లక్ష్మిని బోధనాస్పత్రిలోనే ఉంచవద్దని ఆమె రాసింది.
తన మరణం పోలీసులకు అస్త్రం కావాలని కూడా ఆమె అభిప్రాయపడింది. తన ఆవేదనను సంధ్యారాణి తన డైరీలో కన్నీటి తడి పెట్టించేలా వ్యక్తం చేసింది. ఆ విషయాలు శుక్రవారం మీడియాలో వచ్చాయి. ఆమె డైరీలోని మాటలు ఇలా ఉన్నాయి.