సభ్యత్వం కోల్పోతారు: తెరాసలో చేరిన ఎమ్మెల్సీలపై డిగ్గీ
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గోవా, కర్నాటక రాష్ట్రాలో పార్టీ ఓటమిపై ఆంటోనీ కమిటీకి వివరించామని కాంగ్రెస్ నేత దిగ్విజయ్సింగ్ చెప్పారు. పార్టీని బలోపేతం చేసే బాధ్యత అధిష్టానం చూసుకుంటుందని చూసుకుంటుందని ఆయన బుధవారం మీడియాకు తెలిపారు.
తెలంగాణలో పార్టీలు మారిన ఎమ్మెల్సీలపై దిగ్విజయ్ స్పందించారు. కాంగ్రెస్ తరపున ఎమ్మెల్సీలుగా ఎన్నికైన వారు తెరాసకు మద్దతు తెలిపితే పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం సభ్యత్వం కోల్పోతారని తెలిపారు. తాను ఇంచార్జీగా ఉన్న రాష్ట్రాల్లో పార్టీ ఓటమిపై తాను ఆంటోనీకి నివేదిక ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఆంటోనీతో ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, మాజీ పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి సమావేశమయ్యారు.
కాంగ్రెస్ వార్రూమ్లో ఆంటోని కమిటీతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు బుధవారం భేటీ అయ్యారు. తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, మాజీ కేంద్ర మంత్రి జైపాల్రెడ్డి, వీహెచ్, వంశీచంద్రెడ్డి, పొన్నం ప్రభాకర్, వివేక్ తదితరులు భేటీకి హాజరయ్యారు.
తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితిపై సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. తెలంగాణ నేతలు ఒక్కొక్కరితో విడివిడిగా మాట్లాడిన కమిటీ సభ్యులు పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై అభిప్రాయాలను పంచుకున్నట్లు సమాచారం.