గ్రూప్లను ప్రోత్సహిస్తారా: జగన్పై వైసీపీ ఎమ్మెల్యే ఆగ్రహం, రంగంలోకి అవినాశ్ రెడ్డి
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి కొంత అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది.
కడప: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక నేతలను కలవకుండానే జగన్ పాదయాత్రకు వెళ్లడంపై ఆయన అలకబూనారు.
జగన్ ఆస్తుల్ని అందుకే స్వాధీనం చేసుకోలేకపోతున్నా, పరువుపోయింది: బాబు, మోడీపై అసహనం
జగన్ కలిసేందుకు అవకాశం ఇవ్వకపోవడంతో అలక
ప్రస్తుతం జగన్ ప్రజా సంకల్ప యాత్ర నిర్వహిస్తున్నారు. ఆయన పాదయాత్ర ఆదివారం నాటికి ఆరో రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో తన నియోజకవర్గంలో నాయకులను కలిసేందుకు జగన్ అవకాశం ఇవ్వకపోవడంపై ఆయన అలక వహించారు. రాచమల్లు ఆవేదన కూడా పట్టించుకోకుండా జగన్ పాదయాత్ర కొనసాగించారు. దీంతో ఆయన అనుచరులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
బుజ్జగించిన అవినాశ్ రెడ్డి
విషయం తెలిసిన ఎంపీ అవినాశ్ రెడ్డి ఆయనను బుజ్జగించడంతో తగ్గినట్లుగా తెలుస్తోంది. అయితే తన నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తూ తన వారిని కలవకుండా గ్రూపులను ప్రోత్సహించడం ఎంత వరకు సమంజసమని రాచమల్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. యాత్ర సమయంలో ఇది సరికాదని వారు చెప్పడంతో రాచమల్లు తగ్గారు.
టీడీపీలోకి వెళ్తారని గతంలో రాచమల్లుపై ప్రచారం
కాగా, రాచమల్లు టీడీపీలో చేరనున్నట్లు ఆరేడు నెలల క్రితం జోరుగా ప్రచారం సాగింది. కడపలో పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు. ఆ దారిలోనే రాచమల్లు నడుస్తారని ప్రచారం సాగింది. కానీ ఆయన మాత్రం తాను జగన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదని, వైయస్ అంటే తనకు అభిమానమని చెప్పారు.
వంగవీటి రాధా పాదయాత్ర
ఇదిలా ఉండగా, జగన్ పాదయాత్రకు మద్దతుగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ వంగవీటి రాధాకృష్ణ శనివారం సాయంత్రం నగరంలోని రెడ్ సర్కిల్ ప్రాంతంలో పాదయాత్ర చేశారు. రెడ్ సర్కిల్ నుంచి ఇందిరాపార్క్ మున్సిపల్ స్టేడియం వరకు సాగింది.