రాజధాని రైతులకు మద్దతుగా అశ్వనీదత్... చిరంజీవి , పవన్ కళ్యాణ్ లపై ఆసక్తికర వ్యాఖ్యలు
రాజధాని అమరావతి రైతులు రాజధాని అమరావతి తరలింపుకు నిరసనగా ఆందోళనలను ఉధృతం చేస్తున్నారు . ఇక వారిని అణచివెయ్యటానికి రాజధానిలో పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. భారీగా మోహరించిన పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటున్నారు. దాడులు చేస్తున్నా, మహిళలు అని కూడా చూడకుండా అరెస్ట్ లు చేస్తున్నా పోరాటం మాత్రం కొనసాగిస్తున్నారు మహిళలు. ఇక రాజధాని ప్రజల పోరాటం నేపధ్యంలో అన్ని వర్గాల వారు , సినీ పరిశ్రమ వర్గాలు సైతం తమ మద్దతు అమరావతి ప్రాంత రైతులకు తెలియజేస్తున్నారు .
రాజధాని రైతుల పోరాటానికి మద్దతుగా నిర్మాత అశ్వనీదత్
ఇక తాజాగా రాజధాని అమరావతి విషయంలో సింగర్ స్మిత స్పందించారు. రాజధాని రైతులకు అండగా ఉంటానని చెప్పారు ఇక నారా రోహిత్ కూడా రాజధాని రైతుల కోసం నేను సైతం అంటూ ముందుకు వచ్చారు. ఇక నేడు రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించారు సినీ నిర్మాత అశ్వనీదత్ . రాజధాని రైతులతో మాట్లాడిన ఆయన అక్కడ పరిస్థితులను ఉద్దేశించి చాలా ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను దారుణంగా కొట్టారని, అక్కడ ఉన్న వారిలో నకిలీ పోలీసులు ఉన్నారని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
చిరంజీవి, పవన్ ల మధ్య వ్యత్యాసం చెప్పిన అశ్వనీదత్
ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి ప్రకటించిన మూడు రాజధానుల ప్రతిపాదనను చిరంజీవి స్వాగతించటం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు. చిరంజీవి ఎలా, ఏం తెలుసని మూడు రాజధానులు బాగుంటుందని చెప్పారని అశ్వనీదత్ ప్రశ్నించారు . పవన్కళ్యాణ్ సినిమాల్లో నటిస్తే వందల కోట్లలో సంపాదిస్తారని సినిమాలు వదిలేసి రైతుల కోసం ఎందుకు పోరాడుతున్నాడో చిరంజీవికి తెలియదా అని ప్రశ్నించారు అశ్వనీదత్ . పృథ్వీ కమెడియన్ అని , ఆయన మాటలకు విలువ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు.
రాజధాని పోరాటానికి మద్దతు ఇవ్వనివారి సినిమాలు చూడకండి అన్న అశ్వనీదత్
పృథ్వీ లాంటి వారి వల్లే జగన్ భ్రష్టు పట్టిపోతున్నారని, జగన్ కు చెడ్డ పేరు వస్తుందని చెప్పుకొచ్చారు. మద్దతు కోసం సినీ హీరోలను రైతులు అడ్డుకోవాల్సిన అవసరం లేదని వాళ్ళ సినిమాలు చూడటం మానెయ్యాలని , అప్పుడు వాళ్ళే దిగివస్తారని చెప్పారు అశ్వనీదత్ . ఈ ప్రాంతంలో పుట్టిన వాళ్లు సూపర్ స్టార్లుగా ఉన్నారని, నటుడిగా కాకున్నా సగటు మనిషిగా స్పందించాల్సిన అవసరం లేదా అశ్వనీదత్ ప్రశ్నించారు .
రైతులకు బహుమానంగా ఒక్కో ఇంటికి 10 మంది పోలీసులా అని ఆగ్రహం
గన్నవరం ఎయిర్పోర్టు విస్తరణకు భూములిస్తే ప్రతిగా రాజధానిలో భూములిచ్చారని.. ఎయిర్పోర్ట్ విస్తరించారని.. ఆ భూములను ఎలా తిరిగిస్తారని అశ్వనీదత్ ప్రశ్నించారు. 151 సీట్లు ఇచ్చిన ప్రజల ఆకాంక్షలను గౌరవించాలని అశ్వనీదత్ ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. బొత్స ఏం మాట్లాడుతున్నారో ఆయన కుటుంబ సభ్యులకే అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. భూములిచ్చిన రైతులకు బహుమానంగా ఒక్కో ఇంటికి 10 మంది పోలీసులను పెట్టారా అని మండిపడ్డారు అశ్వనీదత్ . రాజధాని రైతులకు మద్దతుగా రాజధానిలో పర్యటించిన అశ్వనీదత్ అక్కడ ప్రజలతో మాట్లాడి తన సంఘీభావం తెలియజేశారు.