'హీరోలారా! రూ.1000 కోట్లు వస్తున్నాయి.. మీరు బయటకు రారా, చూసి బుద్ధి తెచ్చుకోండి'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలని, ఈ ప్రత్యేక హోదా ఉద్యమానికి తెలుగు సినిమా పరిశ్రమ కలిసి రావాలని డిమాండ్ చేస్తూ విజయవాడ పున్నమి ఘాట్లో సినీ నిర్మాత రవిచంద్ శనివారం జలదీక్ష చేపట్టారు.
ఏడాదికి రూ.వెయ్యి కోట్ల ఆదాయం ఆర్జిస్తున్న సినీ పరిశ్రమ ప్రత్యేక హోదా కోసం ఎందుకు కలిసి రావడం లేదని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. తమిళ హీరోలను చూసి తెలుగు హీరోలు బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. ఒక వేదికగా హోదా ఉద్యమం చేయాలన్నారు.
నీవు పార్టీకి ఉపయోగపడట్లేదు: మురళీమోహన్కు బాబు షాక్, ఇక చెప్పను.. చర్యలే! నేతల ర్యాంకులివి!
తమిళ హీరోలను చూసి బుద్ధి తెచ్చుకోండి
రవిచంద్తో పాటు పలువురు జలదీక్షలో పాల్గొన్నారు. టాలీవుడ్ టాప్ హీరోలు హోదా ఉద్యమంలోకి రావాలంటూ వారి పేర్లను ప్లకార్డులో ప్రదర్శించారు. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ, నాగార్జున, వెంకటేష్, ప్రభాస్ తదితరుల పేర్లను అందులో పేర్కొన్నారు. తమిళ హీరోలను చూసి బుద్ధి తెచ్చుకోవాలన్నారు. కావేరీ నీటి కోసం తమిళ హీరోలు గళమెత్తిన విషయం తెలిసిందే.
ఆంధ్రా డబ్బులతో మీరు బతకడం లేదా?
కోట్లు సంపాదించి ప్రత్యేక హోదా గురించి ఎందుకు అడగరని ప్లకార్డులు ప్రదర్శించారు. 'ప్రభాస్ ప్రత్యేక హోదా కోసం కదలిరండి' అంటూ పలువురి హీరోల పేర్లతో ను ప్లకార్డులు ప్రదర్శించారు. 'ఆంధ్రా డబ్బులతో మీరు బతకడం లేదా' అని ప్రశ్నించారు.
ఇదే మా ఆవేదన
తెలుగు హీరోలు అందరూ కూడా తెలుగు ప్రజల ద్వారా కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారని రవిచంద్ విమర్శించారు. విభజన సమయంలో ఏపీకి ఎన్నో హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. తమిళ ప్రజల కోసం అక్కడి హీరోలు ఎలా స్పందించారో అందరం చూశామన్నారు. అలాగే తెలుగు హీరోలు ఎందుకు స్పందించడం లేదనేది తన ఆవేదన, ప్రజల ఆవేదన అన్నారు.
ఆవేదన అర్థం కావాలంటే హీరోలు రావాలి
తెలుగు ప్రజల హోదా ఆవేదన కేంద్రానికి అర్థం కావాలంటే జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ వంటి పెద్ద హీరోలతో పాటు సురేష్, రాజమౌళి, శ్రీనువైట్ల, పూరీ జగన్నాథ్ వంటి పెద్ద నిర్మాతలు, డైరెక్టర్లు ప్రజలకు మద్దతుగా రావాలన్నారు. అందుకే జలదీక్ష చేస్తున్నామన్నారు.
పరిశ్రమ విజయవాడకే రావాల్సిన అవసరం లేదు
పరిశ్రమ అంతా విజయవాడకే వచ్చి దీక్ష చేయాల్సిన అవసరం లేదని రవిచంద్ అన్నారు. హైదరాబాదులోని చాంబర్, కౌన్సెల్లో ఎవరూ ఇబ్బంది పడకుండా ఓ రోజు చూసుకొని అందరు ఆందోళన చేస్తే బాగుంటుందన్నారు. ప్రజల నుంచి టిక్కెట్ల ద్వారా రూ.వెయ్యి కోట్లు తీసుకుంటున్నారని, ప్రభుత్వం కూడా రాయితీలు ఇస్తోందని, ఇవన్నీ తీసుకొని బాగుంటున్నారని ఉద్యమాలు ఎందుకు చేయరని ప్రశ్నించారు.
సొంత అజెండాతో రాజకీయ పార్టీలు
ప్రత్యేక హోదా కోసం రాజకీయ పార్టీలు సొంత అజెండాతో వెళ్తున్నాయని ఆరోపించారు. హోదా కోసం కలిసికట్టుగా ఎవరూ వెళ్లడం లేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో అన్ని పార్టీలు కలిశాయని, కానీ ఇక్కడ సొంత అజెండాతో వెళ్తున్నారన్నారు. సినిమా పరిశ్రమకు ఏ పార్టీతో సంబంధం ఉండదు కాబట్టి అగ్ర హీరోలు, నిర్మాతలు, దర్శకులు ఉద్యమిస్తే జాతీయస్థాయిలో దీనికి స్పందన వస్తుందని, కేంద్రం కూడా అహంకారం చూపించదన్నారు. సినిమా ఇండస్ట్రీ ఎందుకు స్పందించదనేదే తన ప్రశ్న అన్నారు.