కేసీఆర్, బాబు మాట తప్పారు: టార్గెట్ 2019, 'పవన్ మాతో కలిస్తే మేలు'
హైదరాబాద్: సీఎం పదవులు కుటుంబ వారసత్వమన్నట్టు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు తమ కుమారులను సీఎంలుగా చేసేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారని ఉస్మానియా న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ గాలి వినోద్కుమార్ విమర్శించారు. చిత్తూరు జిల్లా బి.కొత్తకోటలో ఆదివారం జరిగిన బహుజనుల పొలికేక చైతన్య సభలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ వస్తే దళితున్ని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన కేసీఆర్ తానే ముఖ్యమంత్రి అయ్యారని వ్యాఖ్యానించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందని తెలిసే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బీసీని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పారని అన్నారు.
ఇచ్చిన మాట తప్పడంలో ఒకరికొకరు తీసిపోరని ఆయన విమర్శించారు. బీజేపీకి బానిస అయిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్కు హోదా కోసం పట్టుబట్టడం లేదని అన్నారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బహుజనులతో కలిస్తే వచ్చే ఎన్నికల్లో మంచి ఫలితాలను రాబట్టొచ్చని ఆయన తెలిపారు.
2018లో తాను ఉద్యోగానికి రాజీనామా చేసి తమిళనాడు, తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించనున్నట్టు ప్రకటించారు. భారతీయ అంబేద్కర్ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు పీటీఎం శివప్రసాద్ మాట్లాడుతూ 13 జిల్లాల్లో చంద్రబాబు విమానాశ్రయాలు కడితే దళిత, బహుజనులు విమానాల్లో విహరిస్తారా? అని ప్రశ్నించారు.
చంద్రబాబు బహుజనుల భూములను లాక్కొని చైనా, సింగపూర్, జపాన్ దేశాలకు ధారాదత్తం చేస్తున్నారని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీలు పంట రుణాలకోసం బ్యాంకులకు వెళ్తే దొంగల్లా చూస్తున్నారని పేర్కొన్నారు. పౌరహక్కుల సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి చిలుకా చంద్రశేఖర్ మాట్లాడుతూ గతంలో చంద్రబాబును ప్రపంచ బ్యాంకు జీతగాడని చెప్పేవారని వ్యాఖ్యానించారు.