దార్శనికుడు జగన్: పవన్ కల్యాణ్ భవిష్యత్తేంటో ఆనాడే హెచ్చరించారు: పైచూపులకే విడివిడిగా: కే నాగేశ్వర్.
అమరావతి: పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన.. భారతీయ జనతా పార్టీతో పొత్తు కుదుర్చుకోవడం పట్ల వామపక్ష భావజాలం ఉన్న మేధావుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు, ఆ పార్టీ క్షేత్రస్థాయి నాయకులు పవన్ కల్యాణ్పై నిప్పులు చెరుగుతున్నారు. కమ్యూనిస్టు ఉద్యమాలకు వెన్నుపోటు పొడిచారని మండిపడుతున్నారు. పవన్ కల్యాణ్ చర్యలకు నిరసనగా ప్రదర్శనలను చేపట్టడానికి సిద్ధమౌతున్నారు.
జనసేనపై తొలిసారిగా.. ఘాటుగా..
ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కే నాగేశ్వర్ కూడా పవన్ కల్యాణ్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పడుతున్నారు. మొదటి నుంచీ జనసేన పార్టీకి సానుకూలంగా వ్యాఖ్యలు చేస్తూ వచ్చిన ఆయన తొలిసారిగా.. తనదైన శైలిలో పవన్ కల్యాణ్పై విమర్శలు గుప్పించారు. ఆయనకు పలు ప్రశ్నలను సంధించారు. ఓ వీడియో ద్వారా ప్రొఫెసర్ కే నాగేశ్వర్ తన అభిప్రాయాలను వెల్లడించారు. దీన్ని సోషల్ మీడియాలో విడుదల చేశారు.
అయిదారేళ్లలో ఇన్ని రాజకీయ పల్టీలా:
జనసేన పార్టీని స్థాపించే సమయంలో పవన్ కల్యాణ్ అనేక లక్ష్యాలు తన ముందు ఉన్నట్లు చెప్పుకొచ్చారని కే నాగేశ్వర్ గుర్తు చేశారు. 25 సంవత్సరాల పాటు సుదీర్ఘ రాజకీయాలను కొనసాగించాలనే లక్ష్యంతో తాను పార్టీని స్థాపించినట్లు చెప్పుకొన్న పవన్ కల్యాణ్.. అతి తక్కువ కాలంలోనే ఇలా తడబడతారని తాను అనుకోలేదని వ్యాఖ్యానించారు. పార్టీని స్థాపించిన తరువాత అయిదారేళ్లలోనే పవన్ కల్యాణ్ ఇన్ని రాజకీయ పల్టీలు ఎందుకు కొట్టారో సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఏడునెలల కాలంలోనే మాట మార్చారు..
భవిష్యత్తులో తాను బీజేపీతో కలిసేది లేదంటూ గత ఏడాది మేలో ఎన్నికల ప్రచార సభల్లో పవన్ కల్యాణ్ విస్తృతంగా ప్రచారం చేశారని ప్రొఫెసర్ కే నాగేశ్వర్ చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా కమ్యూనిస్టులతో కలిసి ఎన్నికల్లో పోటీ చేశారని, ఏడాది కూడా గడవక ముందే. తన మాటలను తానే ఉల్లంఘించిన ఘనుడని ఎద్దేవా చేశారు. బీజేపీని సమర్ధించడానికి, ఆ పార్టీ పంచన చేరడానికి ఈ ఏడునెలల కాలంలో రాజకీయాల్లో ఎలాంటి మార్పు వచ్చిందని ప్రశ్నించారు.
ఏం సాధించిందని బీజేపీ పంచన..
ఏపీ బీజేపీతో జనసేన పార్టీ పొత్తు పెట్టుకోవడానికి గల కారణాలేమిటో వెల్లడించాలని నాగేశ్వర్ డిమాండ్ చేశారు. ఈ ఏడునెలల కాలంలో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఏ ఘనకార్యాన్ని సాధించిందని నిలదీశారు. బీజేపీతో పొత్తు కోసం వెపర్లాడటానికి గల కారణాలు, కమ్యూనిస్టు నాయకులు వేస్తోన్న ప్రశ్నలకు సరైన సమాధానాలను చెప్పాల్సిన బాధ్యత పవన్ కల్యాణ్పై ఉందని అన్నారు. ఉత్తి పుణ్యాన బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వెనుక కారణాలేమిటో బహిర్గతం చేయాలని చెప్పారు.
వైఎస్ జగన్ ఆనాడే చెప్పారు..
పవన్ కల్యాణ్ రాజకీయ భవిష్యత్తు ఏమిటనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాడే ఊహించిందని కే నాగేశ్వర్ అన్నారు. తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన.. ఈ మూడు పార్టీలో ఒకే తాను ముక్కలంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేసిన వ్యాఖ్యనాలు ఇప్పుడు నిజం అయ్యాయని అన్నారు. వైఎస్ఆర్సీపీ ఆరోపణలను అప్పట్లో పవన్ కల్యాణ్ తీవ్రంగా ఖండించారని గుర్తు చేశారు. ఈ మూడు పార్టీలు మళ్లీ కలుసుకోవడానికి అవకాశాలు ఉన్నాయని ఆయన అంచనా వేశారు.
బీజేపీతో పొత్తు కోసం టీడీపీ వెంపర్లాట..
బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి తెలుగుదేశం పార్టీ వెంపర్లాడుతోందని నాగేశ్వర్ అన్నారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతసేపూ వైఎస్ జగన్ను టార్గెట్గా చేసుకుంటున్నారే తప్ప.. అమరావతి విషయంలో కేంద్రం జోక్యం చేసుకోనప్పటికీ.. ఒక్క మాట కూడా మాట్లాడట్లేదని అన్నారు. ఈ మూడు పార్టీల నాయకులు విడివిడిగా ఉన్నారే తప్ప.. ఒకే కలిసే ఉన్నారనే ఆరోపణలు నిజం అయ్యాయని అన్నారు.