అగ్రిగోల్డ్ కేసులో పురోగతి:సంస్థకు చెందిన 36 ఆస్తులను జప్తు చేసిన ఏపి ప్రభుత్వం
అమరావతిఃఅగ్రిగోల్డ్ కేసుకు సంబంధించి ఎపి ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. తెలంగాణ, కర్ణాటకతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న ఆస్తులను జప్తు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ఆస్తులకు సంబంధించిన వివరాలను నేర పరిశోధక శాఖ ఇచ్చిన నివేదిక ప్రకారం గుర్తించినట్లు ఎపి ప్రభుత్వం పేర్కొంది. ఎవరెవరి పేరుతో ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయన్న అంశంపై నేర పరిశోధక శాఖ ఇచ్చిన నివేదికను వినియోగించుకున్నామని...ఆ ప్రకారం ఈ చర్యలు తీసుకున్నామని ప్రభుత్వం తెలిపింది. మూడు రాష్ట్రాల్లో 103.23 ఎకరాల భూములు, 5,645 చ.గజాల స్థలాల రూపంలో ఉన్న మొత్తం 36 ఆస్తులను జప్తు చేసినట్లు ఎపి అధికారులు వెల్లడించారు.
అగ్రిగోల్డ్ బాధితుల సమస్యను తాను చాలా సీరియస్ గా తీసుకుంటున్నానని...వారి ప్రతి పైసా వసూలు చేసి ఇప్పిస్తానని సిఎం చంద్రబాబు స్పష్టం చేసి 24 గంటలు కూడా గడవక ముందే ప్రభుత్వం ఆస్తులు జప్తు ప్రక్రియ ప్రారంభించడంతో సిఎం హామీ నెరవేరే దిశలో పురోగతి కనిపిస్తోంది. మంగళవారం ఉండవల్లిలోని గ్రీవెన్స్హాలు వద్ద అగ్రిగోల్డ్ బాధితుల్లో మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెక్కులను సీఎం చంద్రబాబు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సిఎం చంద్రబాబు మాట్లాడుతూ అగ్రి గోల్డ్ కుంభకోణం అనేది టీడీపీ ప్రభుత్వం రాక ముందు జరిగిన అతిపెద్ద స్కామ్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్య పరిష్కారానికి అందరం సమన్వయంతో కృషి చేద్దామని ఈ సందర్భంగా సిఎం చంద్రబాబు పిలుపునిచ్చారు."నేను అసోసియేషన్ను ఒకటే కోరుతున్నా...మీరు బాధితుల తరఫున మాట్లాడుతున్నారు. బాధితులతో కమిటీ వేసుకోండి"...అని సీపీఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావుకు సిఎం సూచించారు.
అగ్రి గోల్డ్ బాధితులకు న్యాయం చేయాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే తక్షణ చర్యలు చేపట్టాలంటూ విపక్షాల డిమాండ్ నేపత్యంలో ప్రభుత్వం చర్య ప్రాధాన్యత సంతరించుకుంది. ఒక ప్రత్యేక ఉన్నతాధికారుల బృందానికి పోలీసు, రెవెన్యూ, అకౌంట్స్పై అధికారాలిచ్చి అగ్రి గోల్డ్ ఆస్తుల జప్తు దగ్గర నుండి వేలం, రిజిస్ట్రేషన్ ఇతర ప్రక్రియలను నిర్వహించడంతో పాటు బాధితులకు పరిహారాన్ని అందించే బాధ్యతలు అప్పగించాలని లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ గతంలో సూచించారు. తద్వారా అగ్రి గోల్డ్ ఏజెంట్లు, ఖాతాదారుల సమస్యలు పరిష్కారమవుతాయని ఆయన సూచించారు.