జగన్ పై దాడి కేసులో పురోగతి...ఆ వివరాలు ఇప్పుడే బయట పెట్టలేం:విశాఖ డీసీపీ-2 అద్నాన్ నయీం
విశాఖపట్నం:వైసీపీ అధ్యక్షుడు జగన్ పై దాడి కేసులో కొంత పురోగతి సాధించినట్లు విశాఖ డీసీపీ-2 అద్నాన్ నయీం అస్మి తెలిపారు. ప్రధాన నిందితుడు జె. శ్రీనివాసరావును గత నెల 26న అరెస్టు చేసిన విశాఖ పోలీసులు మరింత సమాచారం కోసం 6 రోజులు కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
కస్టడీలో ఐదో రోజైన గురువారం నాటి విచారణకు సంబంధించిన వివరాలను విశాఖ డీసీపీ-2 అద్నాన్ నయీం అస్మి మీడియాకు వెల్లడించారు. ఇప్పటివరకూ అన్ని కోణాల్లోనూ జరిపిన విచారణలో కొన్ని ముఖ్యమైన ఆధారాలు లభ్యమయ్యాయన్నారు. అయితే కేసు సంక్లిష్టత దృష్ట్యా ఆ వివరాలు ఇప్పుడే బయటపెట్టలేమని అద్మాన్ చెప్పారు. ఇదిలావుంటే శ్రీనివాస్ కస్టడీ నేటితో ముగియనుండగా మరోవైపు పాదయాత్ర పున:ప్రారంభించే నిమిత్తం శుక్రవారం జగన్ విశాఖ రానుండటం గమనార్హం.
పురోగతి ఉంది...కానీ చెప్పలేం
జగన్ పై దాడి కేసులో ఐదు రోజులు విచారణ జరిపిన సిట్ పోలీసులు ఐదో రోజు ఈ కేసులో కాస్త పురోగతి సాధించినట్లు మీడియా సమావేశంలో వెల్లడించారు. ఐదో రోజు కేసు విచారణ గురించి వివరాలు వెల్లడించేందుకు విశాఖ డీసీపీ-2 అద్నాన్ నయీం అస్మి విలేకరుల సమావేశం నిర్వహించారు. అయితే ఆ పురోగతి వివరాలు మాత్రం ఇప్పుడు వెల్లడించలేమని అన్నారు. శ్రీనివాసరావుతో ఈ ఘాతుకానికి పాల్పడిన కుట్రదారులు, సూత్రదారులెవరనేది తెలిసిందా?...అని విలేకరులు ప్రశ్నించగా శుక్రవారం చూడండని చెప్పుకొచ్చారు.
తల్లిదండ్రుల ఎదుట...ప్రశ్నలు
'ఎందుకింత పని చేశావ్, కుటుంబాన్ని ఎందుకు రోడ్డుకు ఈడ్చావ్' అంటూ శ్రీనివాస్ ను అతడి తల్లిదండ్రులు నిలదీసినట్లు సమాచారం. విచారణలో భాగంగా శ్రీనివాసరావు తల్లిదండ్రులను సిట్ పోలీసులు విశాఖ తీసుకొచ్చారు. తల్లిదండ్రులను చూసిన వెంటనే నిందితుడు భావోద్వేగానికి గురైనట్లు తెలుస్తోంది. తొలుత నిందితునితో పాటు ఆయన తల్లిదండ్రులను కలిపి విచారించిన సిట్ తరువాత ఒక్కొక్కరిని వేర్వేరుగా విచారించినట్లు తెలుస్తోంది. ఎందుకింత ఘోరానికి పాల్పడ్డావంటూ వారు వేసిన ప్రశ్నలకు శ్రీనివాసరావు ఏమీ సమాధానం చెప్పలేదని, ఏడుస్తూ కూర్చున్నాడట. విచారణ ముగియడంతో శ్రీనివాసరావు తల్లిదండ్రులను అధికారులు మళ్లీ స్వగ్రామానికి పంపించేశారు.
గురువారం ...విచారణ తీరు ఇది
గురువారం నిందితుడి తల్లిదండ్రుల నుంచి అతని ప్రవర్తన, నడవడిక, ఆలోచనా విధానంపై ఆరా తీయడం, రోజు మాదిరీ నిందితుడి స్నేహితురాలు రమాదేవి, రేవతిపతిలతో పాటు మరో ముగ్గురు సహ ఉద్యోగులను వివిధకోణాల్లో విచారించారు. కేసులో కీలక నిందితునిగా భావిస్తున్న హర్షవర్థన్ గురువారం కూడా పిలిచి కాసేపు విచారించి వదిలేశారు. మరోవైపు శ్రీనివాస్ కాల్ డేటా ఆధారంగా 321 మందికి కాల్ చేసి వారితో నిందితునికి ఉన్న సంబంధం, ఎందుకు కాల్ చేసాడు? ఏం మాట్లాడాడు? ఈ హత్యాయత్నం గురించి ఏమైనా చెప్పాడా? అన్న అంశాలపై ఆరా తీసి వారి స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు. మరో వైపు సీసీ కెమెరాల పుటేజ్ ఆధారంగా గడిచిన నెల రోజులుగా నిందితుని నడవడిక, వ్యవహార శైలిని పరిశీలించేందుకు ఐదుగురు నిపుణులతో విశ్లేషిస్తున్నారు.
శుక్రవారంతో...ముగియనున్న కస్టడీ
శ్రీనివాసరావును గత ఆదివారం రిమాండ్ నుంచి పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. పోలీసులు ఆరు రోజులు కస్టడీ కోరడంతో కోర్టు అంగీకరించింది. శుక్రవారం సాయంత్రం 5 గంటలతో కోర్టు ఇచ్చిన కస్టడీ గడువు ముగియనుంది. ఆ తరువాత శ్రీనివాసరావును తిరిగి విశాఖ సెంట్రల్ జైలుకు పంపిం చేయాల్సి ఉంది. కానీ ఇంతవరకూ కీలకమైన ఆధారాలను ఆయన నుంచి పోలీసులు రాబట్టలేకపోయారనే వైసిపి నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో మరింత సమయం శ్రీనివాసరావును తమ కస్టడీలోనే ఉంచాలని పోలీసులు కోరనున్నట్లు సమాచారం. గురువారం సాయంత్రం శ్రీనివాసరావుకు కెజిహెచ్ వైద్యులు విజయబాబు వైద్య పరీక్షలు నిర్వహించి అంతా నార్మల్గా ఉందని ధ్రువీకరించడం గమనార్హం.
Recommended Video