రాములు హత్య కేసులో పురోగతి: సిటీ బైకుల గుర్తింపు
హైదరాబాద్: మాజీ మావోయిస్టు నేత సాంబశివుడి సోదరుడు, తెలంగాణ రాష్ట్ర సమితి నేత కోనాపురి రాములు హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. హత్య జరిగిన ప్రాంతంలో పోలీసులు నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న బైకులలో మూడు హీరో హోండాలు, ఒక పల్సర్ ఉంది. ఈ బైకుల యజమానుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఈ బైకుల ఆధారంగా హైదరాబాదుకు చెందిన నలుగురు యువకులే ఈ హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బైకు యజమానులు హైదరాబాదులోని ఉప్పల్, ఎల్బీనగర్ తదితర ప్రాంతాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వారి ఇళ్లలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
బైకు యజమానులుగా చంద్రశేఖర రెడ్డి, సంపత్, ఇంతియాజ్, సుదర్శన్లుగా పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. పోలీసులు కోనాపురి రాములు ఇంటి వద్ద గల సిసి కెమెరాలను పరిశీలించారు. అందులో నలుగురు యువకులు గతంలో రాములు నివాసం వద్ద రెక్కీ నిర్వహించినట్లుగా పోలీసులు గుర్తించారు.
కాగా, మావోయిస్టు పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి సాంబశివుడి సోదరుడు, నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు కొనాపురి రాములు తుపాకీ గుళ్లకు బలైన విషయం తెలిసిందే. ఒక కార్యక్రమం కోసం మిర్యాలగూడ రోడ్లోని ఫంక్షన్ హాలుకు వచ్చిన రాములును కొందరు వ్యక్తులు చుట్టుముట్టి ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు.