అదే మా తప్పు, ఏపీ ప్రతినిధిని కాకపోయినా, నన్నే తిడతారా: వెంకయ్య
హైదరాబాద్: ఏ రాష్ట్రానికి ఏ కేంద్ర ప్రభుత్వం చేయని సాయాన్ని తాము ఏపీకి అతి తక్కువ వ్యవధిలో చేశామని కేంద్రమంత్రి, బిజెపి నేత వెంకయ్య నాయుడు ఆదివారం నాడు అన్నారు. పదేళ్లలో చేయాల్సినవి మేం రెండేళ్లలో చేయడమే మేం చేసిన తప్పా అని నిలదీశారు.
ప్రత్యేక హోదా విషయంలో బీజేపీని, కేంద్రాన్ని, తనను నిలదీస్తున్న కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్, సిపిఎం, సీపీఐ, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్లకు వెంకయ్య నాయుడు కౌంటర్ ఇచ్చారు.
విశాఖను అంతర్జాతీయ పటంలో..
విశాఖపట్టణాన్ని అంతర్జాతీయ పటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నామన్నారు. కామన్వెల్త్ సమావేశాలు విశాఖలో పెట్టామన్నారు. బ్రిక్స్ సదస్సు కూడా విశాఖలో పెట్టబోతున్నామన్నారు. పోలవరం ఖర్చు కేంద్రమే భరిస్తుందన్నారు. రెవెన్యూ లోటు భర్తీ చేస్తామన్నారు.
ఓ ప్రశ్న వేస్తా, ప్రతిదీ హైదరాబాద్ కాదు: కేవీపీకి వెంకయ్య ప్రశంస, పవన్కు కౌంటర్
తాము అధికారంలోకి వచ్చిన మొదటి రోజే పోలవరం ప్రాజెక్టు కోసం ఆర్డినెన్స్ తీసుకు వచ్చామన్నారు. అమరావతి నగరాన్ని స్మార్ట్ సిటీగా ప్రకటించే ప్రతిపాదన ఉందన్నారు. ఏపీ పైన ప్రధాని మోడీ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారన్నారు. ఏపీకి ఇచ్చే లాభాలు మరే రాష్ట్రానికి ఇవ్వలేదన్నారు.
చరిత్రలో ఇంత తక్కువ వ్యవధిలో ఏ రాష్ట్రానికి ఇంతలా న్యాయం జరగలేదన్నారు. దయచేసి అన్నం పెట్టే చేయిని నరుక్కోవద్దన్నారు. రాష్ట్రానికి జరిగే మేలును అడ్డుకోవద్దన్నారు. కేంద్రం ఇచ్చే మద్దతును, సాయాన్ని వ్యతిరేకించే వారు అభివృద్ధి వ్యతిరేకులు అన్నారు.
ప్రజలను నమ్మించి ముంచిన వారికి తమను ప్రశ్నించే హక్కు లేదని వెంకయ్య కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పోలవరం కోసం ఆర్డినెన్స్ తీసుకు వచ్చినప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుడు తనను గో బ్యాక్ వెంకయ్య అన్నారని గుర్తు చేశారు. ఓ జాతీయ పార్టీ నేత అలా అంటారా అన్నారు.
నేను ఏపీకి, తెలంగాణకు మంత్రిని కాదని, దేశానికి మంత్రిని అని చెప్పారు. తెలుగువాడిగా ఏపీకి న్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నానని చెప్పారు. కొంతమంది అతిగా మాట్లాడటం విడ్డూరమన్నారు.
పదేళ్లలో చేయమంటే రెండేళ్లలో చేశాం అది తప్పా
చట్టంలో పలు అంశాలను పదేళ్ల చేయాలని ఉందన్నారు. కానీ మేం రెండేళ్లలోనే చేశామన్నారు. ఇప్పుడు తమను ప్రశ్నించే వారి తీరు ఎలా ఉందంటే.. పదేళ్లలో చేయమంటే రెండేళ్లలో ఎలా చేశారని అడిగినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. విద్యా సంస్థలతో పాటు పలు అంశాలు పదేళ్లలో చేయాలని ఉందన్నారు.
కొంతమంది తనను యాచకుడు అంటున్నారని, తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ఇలాంటి వ్యక్తిగత విమర్శలకు నేను సమాధానం చెప్పనన్నారు. కొందరు పత్రికల్లో ఉండేందుకు తనను విమర్శిస్తున్నారన్నారు. నేను మళ్లీ వాటి పైన మాట్లాడితే మీడియాకు ఎక్కాలని వారు చూస్తారన్నారు.
అభివృద్ధి వికేంద్రీకరణ
గత పాలకులు అన్నింటిని హైదరాబాదులో పెట్టారన్నారు. విశాఖలో, ఒంగోలులో, గుంటూరులు, విజయవాడలో.. ఇలా అభివృద్ధిని వికేంద్రీకరిస్తే బాగుండేదన్నారు.
నేను ఏపీ ప్రతినిధిని కాకపోయినా..
నేను ఏపీకి ప్రతినిధిని కాకపోయినా రాష్ట్రానికి న్యాయం చేయాలని చూస్తున్నానని అన్నారు. తాము ఎలాంటి విషయం పైన అయినా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. ఎవరు కూడా అభివృద్ధికి ఆటంకం కలిగించవద్దని విజ్ఞప్తి చేశారు. ఏపీ అభివృద్ధికి హోదా కాదని, ప్రత్యేక శ్రద్ధ కావాలన్నారు.
చావడానికి సిద్ధం: చంద్రబాబు-వెంకయ్యకు పవన్ కళ్యాణ్ కౌంటర్
ఆంధ్రప్రదేశ్పై ప్రధాని మోదీ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే పోలవరానికి అడ్డంకులు తొలగించే ప్రయత్నం చేశాం. పోలవరం నిర్మాణానికి 35 ఏళ్లలో ఏమీ చేయకుండా .. రెండేళ్లలో చేయాలంటున్నారు.
రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక హోదాతోనే సాధ్యమవుతుందని కొందరి వాదన అని, ప్రత్యేక హోదా వల్ల కొంత మేలు జరుగుతుందనడంలో అనుమానం లేదని, ఏపీకి న్యాయం కోసం నీతి ఆయోగ్ ఛైర్మన్, సభ్యులను పిలిపించి మాట్లాడామన్నారు. కేంద్రమంత్రులను సమావేశపరిచి చట్టాన్ని చదివి వినిపించి ఆయా శాఖలతో ప్రత్యేకంగా మాట్లాడానని చెప్పారు.
జైట్లీతో 70సార్లు మాట్లాడా
విభజన వల్ల ఏపీకి రూ.22వేల కోట్లు రెవెన్యూ లోటు ఏర్పడిందని, ఆ లోటు భర్తీకి రూ.22 వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని నిర్ణయించిందన్నారు. ఐఐటీ, ఐఐఐటీలు, ఎయిమ్స్ వంటి ప్రముఖ సంస్థలు ప్రత్యేక హోదా వల్ల రావని, ఏపీ అంశంపై జైట్లీతో కనీసం 70 సార్లు మాట్లాడానని చెప్పారు.
ప్రత్యేక దృష్టి, శ్రద్ధ, సాయంతోనే ఆంధ్రప్రదేశ్ నిలదొక్కుకుంటోందన్నారు. విదేశీ రుణాన్ని రాష్ట్రానికి ఇచ్చి ఆ డబ్బులను కేంద్రమే భరించేలా చూస్తున్నామన్నారు. కేవలం ఏపీకి మాత్రమే 1.93లక్షల ఇళ్లు కేటాయించామన్నారు. ఏపీకి రూ.2.25 లక్షల కోట్ల ప్రాజెక్టుల వస్తున్నాయన్నారు.