ఎవర్ని కలిశారో చూడండి: ముద్రగడతో భూమన, అంబటి భేటీలపై బొండా ఉమా
ఏలూరు: ఎన్నికల సమయంలో కాపు సామాజికవర్గానికి ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, కాపులంతా ఆ అంశాన్ని అర్ధం చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు చెప్పారు. రానున్న రోజుల్లో ఎటువంటి న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని చర్యలు చేపట్టామని చెప్పారు.
అయితే దురదృష్టవశాత్తు కొంతమంది కాపునేతలు విమర్శలు కురిపిస్తున్నారని, మేలు చేస్తామని ప్రభుత్వం ముందుకొస్తుంటే విమర్శలు ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు. పదేళ్లపాటు గుర్తుకు రాని ఈ అంశం ఆ నాయకులకు ఇప్పుడే గుర్తు వచ్చిందా అంటూ ప్రశ్నించారు.
స్ధానిక జిల్లా టిడిపి కార్యాలయంలో బుధవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే ప్రభుత్వం కాపు కార్పోరేషన్ను ఏర్పాటుచేసిందని, దీనికి వంద కోట్ల రూపాయల నిధులు కేటాయించిందని చెప్పారు. కొద్దిరోజుల్లోనే కాపు కార్పోరేషన్ కార్యకలాపాలు ముమ్మరంగా ముందుకు సాగుతాయన్నారు.
అవసరమైతే మరిన్ని నిధులు కేటాయించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు తగ్గట్టుగా కాపులకు రిజర్వేషన్లు కల్పించేందుకు ఇప్పటికే కమిషన్ ఏర్పాటు చేశారని, ఈ నివేదిక రాగానే అవసరమైన చర్యలు తీసుకుంటారని చెప్పారు.
పరిస్ధితులు ఇలాఉంటే కాపులకు ప్రభుత్వం అనుకూలంగా చర్యలు తీసుకుంటుంటే కొంతమంది కాపు నాయకులు కొన్ని పార్టీలకు పావులుగా మారిపోయారన్నారు. ఈ వర్గానికి జరుగుతున్న మేలును అడ్డుకునే స్థాయిలో వ్యవహారాలు చేస్తున్నారన్నారు.
తమ వేళ్లతో తమ కళ్లే ఎవరైనా పొడుచుకుంటారా అంటూ ఆయన ప్రశ్నించారు. ఈ వ్యవహారాల వెనుక కుట్ర దాగి ఉందని, కాపు కుటుంబాలు అ అంశాన్ని గుర్తించి వ్యవహరించాలని సూచించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు అంబటి రాంబాబు, భూమన కరుణాకర్రెడ్డి తుని వెళ్లి ఏ నాయకుడ్ని కలిసేరో గమనించాలన్నారు.
మేలు చేస్తామని, హామీలు అమలుచేస్తామని చెపుతుంటే ఉద్యమాలు ఏమిటని ప్రశ్నించారు. కాపుల్లో అయోమయం సృష్టించేందుకు వీళ్లంతా ప్రయత్నిస్తున్నారన్నారు. వారి రాజకీయ అవసరాల కోసం కాపుల ప్రయోజనాలను తాకట్టు పెట్టవద్దని ఆయన హితవు పలికారు.