తిరుమలలో శ్రీవారి అఖండ దీపం కొండెక్కిందని ప్రచారం ... టీటీడీ క్లారిటీ
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం తిరుమల శ్రీవారి ఆలయం మీద పడింది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టటానికి భక్తులకు దర్శనాలు లేవని చెప్పింది టీటీడీ . ఇక స్వామి వారి నిత్య కైంకర్యాలు జరుగుతాయని ప్రకటించారు . అప్పటి నుండి తిరుమలలో ఆంక్షలు కొనసాగుతున్నాయి . అయితే తిరుమల శ్రీవారి దర్శనాలు కూడా లేక తెగ బాధ పడుతున్న శ్రీవారి భక్తులకు స్వామి వారికి సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న పుకార్లు ఆందోళన కలిగిస్తున్నాయి.
అఖండ దీపం ఆరిపోయిందని వదంతులు
ఈ నేపధ్యంలోనే తిరుమల శ్రీవారి సన్నిధిలో అఖండ దీపం అరిపోయిందని ప్రచారం సాగింది. దీనిపై తాజాగా టీటీడీ అగమశాస్త్ర సలహాదారు రమణ దీక్షితులు స్పందించారు.
సోషల్ మీడియాలో అఖండ దీపం ఆరిపోయిందని వచ్చిన వదంతులను నమ్మొద్దని, అవన్నీ అవాస్తవాలేనని ఆయన వెల్లడించారు. సుప్రభాతం నుంచి ఏకాంతసేవ వరకు అఖండ దీపం వెలుగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.
గర్భాలయంలో అఖండ దీపాలు ఆరిపోలేదని స్పష్టీకరణ
ఇక అంతేకాదు మరోవైపు గర్భాలయంలో రెండు అఖండ దీపాలున్నాయని చెప్పిన ఆయన.. అవి బయట నుంచి భక్తులకు కనిపించవని పేర్కొన్నారు . గర్భాలయంలోని రెండు మూలల్లోనూ రెండు నిలువెత్తు వెండి దీపాలు అలాగే స్వామివారికి ఇరువైపులా రెండు నందా దీపాలు వేలాడుతూ ఉంటాయన్నారు. ఇక వీటిని ప్రతి నిత్యం నిత్య కైంకర్యాలు అయిపోయేవరకు వెలిగించి అర్చకులు కాపాడతారని చెప్పారు. వీటిని ఉదయం సుప్రభాతంలో అర్చకులు వెలిగిస్తారని ఇక రాత్రి ఏకాంత సేవ తరువాత ఈ దీపాలను ఆర్పివేస్తారని మళ్ళీ తిరిగి మరుసటి రోజు ఉదయం సుప్రభాతం వేళ వెలిగిస్తారని చెప్పుకొచ్చారు .
Recommended Video
అఖిలాండం కొండెక్కితే అపచారం కాదు
అటు శ్రీవారి దేవాలయానికి ఎదురుగా ఉన్న బేడి ఆంజనేయస్వామి ఆలయంలో వద్ద అఖిలాండం అనే దీపారాధన ఉంది. ఇక్కడ భక్తులు కర్పూరం వెలిగించి.. కొబ్బరి కాయలు కొట్టి మొక్కులు తీర్చుకుంటారు. ఇక ఇప్పుడు భక్తులు లేకపోవడంతో అఖిలాండం వద్ద కర్పూర దీపం ఆరిపోయింది. ఇది అసలు వాస్తవం అంటూ పేర్కొన్న ఆయన అఖిలాండం ఆరిపోవడం వల్ల ఎలాంటి అపచారం జరగదు అని పేర్కొన్నారు . ఇక దీంతో ఎలాంటి వైపరీత్యం కూడా సంభవించదని చెప్తున్నారు. ప్రజలను భయపెట్టడానికి ఎవరో కొంతమంది ఇలాంటి వదంతులు సృష్టిస్తున్నారని సోషల్ మీడియాలో వచ్చే వదంతులను దయచేసి నమ్మవద్దని పేర్కొన్నారు .