AP Panchayat elections tdp vijayawada visakhapatnam టీడీపీ విజయవాడ విశాఖపట్నం AP Municipal Elections 2021 politics
విశాఖకు కమాండ్ కంట్రోల్ సెంటర్ షిఫ్ట్: జగన్ ట్రాప్లో టీడీపీ: మున్సిపల్ ఎన్నికల వేళ..మౌనం
అమరావతి: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేసే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముమ్మర చర్యలను చేపట్టినట్టే కనిపిస్తోంది. అమరావతి ప్రాంతంలోని గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థలు ఘన విజయాన్ని సాధించిన అనంతరం.. ఉద్యమ ప్రభావం అనుకున్నంత స్థాయిలో లేదనే నిర్ణయానికి వచ్చిన జగన్ సర్కార్.. ఆ ప్రక్రియను మరింత వేగవంతం చేసినట్టే. విజయవాడలో నిర్మించ తలపెట్టిన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను విశాఖపట్నానికి తరలిస్తూ ఆదేశాలను జారీ చేయడం దీనికి సంకేతంగా భావిస్తోన్నారు.
పెయిడ్ ఆర్టిస్ట్ అంటే మండదా: తప్పు విష్ణుదే: తేల్చేసిన రఘురామ: విశాఖ రాజధాని ఉత్తుత్తిదే

మూడు రాజధానులకు అనుకూలంగా ప్రజాతీర్పుగా..
రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ వైఎస్ జగన్ చేసిన ప్రకటనపై 400 రోజులకు పైగా అమరావతి ప్రాంతంలో నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు, ధర్నాలు కొనసాగుతూ వస్తోన్నాయి. అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళనలకు తెలుగుదేశం పార్టీ సారథ్యాన్ని వహిస్తోంది. అమరావతిని పూర్తిస్థాయి రాజధానిగా కొనసాగింపజేయాలంటూ వేర్వేరు రూపాల్లో డిమాండ్ చేసింది. ఈ ఆందోళనలను జగన్ సర్కార్ చూసీ, చూడనట్టు వ్యవహరించిందే తప్ప.. వెనక్కి తగ్గలేదు. న్యాయపరమైన ఇబ్బందులేవీ లేకపోయి ఉంటే ఈ పాటికి విశాఖ నుంచి పరిపాలన ఆరంభమై ఉండేదనే అభిప్రాయాలు సైతం వ్యక్తమయ్యాయి.

పంచాయతీ ఎన్నికలతో పటాపంచలు..
అమరావతి ప్రాంతంలో కొనసాగుతోన్న ఉద్యమం ప్రభావం.. పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతిచ్చిన అభ్యర్థుల విజయాన్ని అడ్డుకోలేకపోయింది. అమరావతి ప్రాంతంలోని అనేక పంచాయతీలను వైసీపీ మద్దతుదారులు స్వీప్ చేశారు. ఉద్యమానికి గుండెకాయగా భావించే గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. అమరావతి ఒక్కటే కాదు.. అటు పరిపాలనా రాజధానిగా ఎంపిక చేసుకున్న ఉత్తరాంధ్ర, న్యాయ రాజధానిని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన రాయలసీమ జిల్లాల్లోనూ వైసీపీ అనుకూలంగా పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. దీనితో నిరసన ప్రభావం ఏ స్థాయిలో ఉందనేది తేలింది.

ఉగాది నాటికి
తెలుగు సంవత్సరాది ఉగాది నుంచి విశాఖ నుంచి పరిపాలనను ప్రారంభించేలా ప్రభుత్వం చకచకా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా విజయవాడలో నిర్మించడానికి ప్రతిపాదించిన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఇక సాగరనగరంలో నిర్మించడానికి పూనుకుంది. దీనికి అవసరమైన ఉత్తర్వులను హోం మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి విడుదల చేశారు. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత.. క్రమంగా కార్యాలయాలను తరలించాలని కూడా భావిస్తోంది. ఇక జాప్యం చేయకూడదనే నిర్ణయానికి వైసీపీ వచ్చినట్లు చెబుతున్నారు.

టీడీపీ వెనక్కి తగ్గినట్టేనా?
ప్రభుత్వం ఆ దిశగా తక్షణ చర్యలను తీసుకోవడానికి సమాయాత్తమౌతోన్నప్పటికీ.. అమరావతి ప్రాంతం నుంచి రాజధాని అంగుళం కూడా కదలబోదంటూ ఇన్నాళ్లూ చెబుతూ వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు స్పందించట్లేదు. దీనికి కారణం- మున్సిపల్ ఎన్నికలే అనేది ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేని విషయం. మున్సిపల్ ఎన్నికల వేళ.. విశాఖపట్నంలో పరిపాలన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చర్యలను అడ్డుకోవడానికి ప్రయత్నించడం మంచిది కాదనే అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తమౌతోంది. కమాండ్ కంట్రోల్ సెంటర్ తరలింపుపై స్పందించొద్దంటూ ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి నుంచి ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. టీడీపీ వైఖరేమిటనేది మున్సిపల్ ఎన్నికల పోలింగ్ తరువాతే బయటపడుతుందని అంటున్నారు.