గ్యాస్ లీకేజ్ కు యాజమాన్య నిర్లక్ష్యమే కారణం.. ఎఫ్ఐఆర్ నమోదు .. విచారణ దిశగా ఏపీ సర్కార్
విశాఖనగరంలోని ఆర్.ఆర్ వెంకటాపురంలో ఎల్జీ పాలిమర్స్ కెమికల్ ఇండస్ట్రీ నుండి లీకైన ప్రమాదకరమైన స్టైరీన్ గ్యాస్ ఘటనపై ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది . ఇక ఈ ఘటనకు బాధ్యులుగా ఎల్జీ పాలిమర్స్ సంస్థపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు విశాఖ కమీషనరేట్ పోలీసులు .
45 మందికి మెయింటెనెన్స్ పాస్లు ఇచ్చినా నో మెయింటెనెన్స్
విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ప్రమాదానికి ఎల్జీ పాలిమర్స్ యాజమాన్య నిర్లక్ష్యమే ప్రధాన కారణమని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది ఏపీ ప్రభుత్వం . లాక్డౌన్లోనూ పరిశ్రమలో ప్రతిరోజు మెయింటెనెన్స్ చేయాల్సి ఉండగా అది జరగలేదని గుర్తించింది . యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టుగా ప్రాధమిక విచారణలో తెలుస్తోంది. లాక్డౌన్ ఉన్నకారణంగా మెయింటెనెన్స్ కోసం ప్రభుత్వం 45 మందికి మెయింటెనెన్స్ పాస్లు ఇచ్చినప్పటికీ పాలిమర్స్ సంస్థ మైంటైన్ సరిగా చెయ్యకపోవటం వల్లే ఈ దారుణం జరిగింది. యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించటం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగిందని తెలుస్తుంది.
యాజమాన్య నిర్లక్ష్య ఫలితమే గ్యాస్ లీకేజ్ దుర్ఘటన
ఇక ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ ట్యాంకుల్లో దాదాపు 2 వేల మెట్రిక్ టన్నుల స్టైరెన్ను నిల్వ చేసింది. అయితే అక్కడ 20 డిగ్రీల లోపు ఉష్ణోగ్రత ఉండాలి. కానీ ఫ్యాక్టరీ యాజమాన్యం దానిపై నిర్లక్ష్యంగా వ్యవహరించింది . ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో ఒక్కసారిగా స్టైరెన్ లీక్ అయి మంటలు చెలరేగాయి. దీంతో ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాలకు స్టైరెన్ గ్యాస్ వేగంగా వ్యాప్తి చెందింది.అంతేకాక కెమికల్ రియాక్షన్ కూడా సంభవించింది . దీంతో గురువారం తెల్లవారుజామున భయంకరమైన విష వాయువులు లీక్ అయ్యాయి. దీంతో వేల సంఖ్యలో ప్రజలు అస్వస్థులయ్యారు.
పరిశ్రమ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామన్న మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
ఇక ఈ ఘటన పై మాట్లాడిన పరిశ్రమల శాఖా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఈ దుర్ఘటనకు కారణమైన పరిశ్రమ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం గ్యాస్ లీకేజీ అగిపోయిందని పేర్కొన్న ఆయన పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పారు. మంత్రి గ్యాస్ లీకేజీ ఘటనపై విచారణ జరిపిస్తామని వెల్లడించారు. బాధిత కుటుంబాలు ధైర్యంగా ఉండాలని ,ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందిస్తామని స్పష్టం చేశారు. బాధితులను ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు. గ్యాస్ లీక్ తో ఇళ్ళ నుండి సురక్షిత ప్రాంతాలకు వచ్చిన వారికి అన్ని మౌలిక వసతులు కల్పించాలని మంత్రి గౌతమ్రెడ్డి కలెక్టర్కు సూచించారు.
Recommended Video
ఎఫ్ఐఆర్ నమోదు ... దర్యాప్తు చేస్తున్నామన్న విశాఖ నగర పోలీస్ కమిషనర్ ఆర్.కె.మీనా
ఇక గ్యాస్ లీక్ ఘటనలో కంపెనీ యాజమాన్యంపై కమీషనరేట్ పోలీసులు కేసు నమోదు చేశారు. విశాఖ నగర పోలీస్ కమిషనర్ ఆర్.కె.మీనా ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతుందని పేర్కొన్నారు. ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్కే మీనా మాట్లాడుతూ స్టేరైన్ గ్యాస్ లీక్ అవ్వడంతో సమీప గ్రామాలను ఖాళీ చేయించామని తెలిపారు.ఇక గ్యాస్ లీకేజ్ కు గల కారణాలపై క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నామని కంపెనీపై ఎఫ్ ఐ ఆర్ నమోదు అయినట్టు పేర్కొన్నారు.