ప్రధాని హెలికాప్టర్ మార్గంలో నల్ల బెలూన్లు- ఎవరి పని : విచారణ మొదలు..!!
ప్రధాని మోదీ పర్యటన సమయంలో చోటు చేసుకున్న ఒక ఘటన కలకలం రేపుతోంది. ప్రధాని మోదీ హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్నారు. అక్కడి నుంచి ఆర్మీ హెలికాప్టర్లతో భీమవరం బయల్దేరారు. ఆయనతో పాటుగా గవర్నర్ - సీఎం జగన్ ఆ హెలికాప్టర్ లోనే ఉన్నారు. మరో రెండు హెలికాప్టర్ల సెక్యూరిటీ ప్రోటోకాల్ లో భాగంగా అనుసరిస్తున్నాయి. అయితే, ఆ సమయంలో నల్ల బెలూన్లు హెలికాప్టర్ల మార్గం కనిపించాయి. దీంతో..ఒక్క సారిగా భద్రతా సిబ్బంది అప్రమత్తం అయ్యారు.
ప్రధాని పర్యటనకు నిరసనగా ఈ బెలూన్లను వదిలి ఉంటారని అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ తొలి నుంచి ప్రధాని పర్యటనకు వ్యతిరేకంగా నిరసనలకు సిద్దమైంది. అందులో బాగంగా కొందరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, ప్రధాని ఏపీకి వచ్చిన సమయంలో ఈ రకంగా నల్ల బెలూన్లు వదలటం రాజకీయంగానే చర్చకు కారణమైంది. అంతకు ముందు ప్రధాని విమానం గన్నవరం చేరుకొనే సమయంలోనూ నల్ల బెలూన్లను వదిలినట్లుగా తెలుస్తోంది. గన్నవరం మండలం లోని కేసరపల్లి గ్రామం నుండి బెలూన్లు వదిలినట్టు గుర్తించినట్లుగా సమాచారం.
అయితే, ప్రధాని నేరుగా భీమవరం వెళ్లి అక్కడ నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం కార్యక్రమంలో పాల్గొన్నారు. అల్లూరి సీతారామ రాజు విగ్రహం ఆవిష్కరణతో పాటుగా. .బహిరంగ సభలోనూ పాల్గొన్నారు. అయితే, ఇది నిరసనలకు పిలుపునిచ్చిన కాంగ్రెస్ మద్దతు దారులు ఎగరవేసారా..లేక, ఇరతులు ఎవరైనా చేసారా అనే కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. దీనికి నిఘా వైఫల్యంగానూ చర్చ సాగుతోంది. ప్రధాని భద్రతా విభాగం సైతం దీని పైన రాష్ట్రం నుంచి సమాచారం సేకరిస్తున్నారు.
కాంగ్రెస్ శ్రేణులు చేసిన పనిగా అనుమానిస్తున్నారు. ప్రధాని పర్యటన సమయంలో ఆయన సెక్యూరిటీ - నిఘా అధికారులు - ఎస్పీజీతో పాటుగా రాష్ట్ర పోలీసులు సైతం అప్రమత్తంగా ఉంటారు. నిఘా వర్గాలు అప్రమత్తంగా వ్యవహరిస్తాయి. కానీ, ఊహించని విధంగా ఈ పరిణామం చోటు చేసుకోవటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.