మండుతున్న తూర్పు గోదావరి: జాతీయ రహదారి దిగ్బంధం: టైర్లు కాల్చి..భారీగా.. !
కాకినాడ: రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటును వ్యతిరేకిస్తూ రైతులు సోమవారం తూర్పు గోదావరి జిల్లాల్లో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలను నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మద్దతు ఇచ్చారు. మూడు రాజధానులను ఏర్పాటు చేస్తూ రూపొందించిన ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన మంత్రివర్గం ఆమోదించిన వెంటనే తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.
జగ్గంపేట వద్ద జాతీయ రహదారి దిగ్బంధం..
తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని రామవరం వద్ద ఈ ఉదయం తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున గుమికూడారు. టైర్లు, కర్రలు పట్టుకుని రామవరం వద్ద జాతీయ రహదారిపైకి చేరుకున్నారు. క్యాన్ల ద్వారా పెట్రోల్ను తీసుకొచ్చారు. వాహనాలను ఎక్కడికక్కడ నిలిపివేశారు. జాతీయ రహదారి నంబర్ 16పై రోడ్డు మధ్య టైర్లు, కర్రలను పేర్చి, పెట్రోల్ పోసి నిప్పంటించారు.
పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించినా..
ఎలాంటి ముందుస్తు అనుమతులు లేకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు, స్థానిక రైతులు జాతీయ రహదారిని దిగ్బంధించడంతో కలకలం చెలరేగింది. సమాచారం అందుకున్న వెంటనే జగ్గంపేట పోలీసులు సంఘటనా స్థలానికి బయలుదేరారు. పోలీసులు వచ్చేలోగానే టీడీపీ నాయకులు తమ ఆందోళనను ఆరంభించారు. టైర్లు, కర్రలను తగులబెట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించడంతో వారు ప్రతిఘటించారు. ఈ సందర్భంగా తోపులాట చోటు చేసుకుంది. ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
కిలోమీటర్ల కొద్దీ స్తంభించిన వాహనాలు..
తగులబెట్టిన టైర్లు, కర్రలను తొలగించడానికి పోలీసులు ప్రయత్నించినప్పటికీ.. నిరసనకారులు అడ్డుకోవడంతో సాధ్య పడలేదు. ఫలితంగా.. జాతీయ రహదారిపై గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. ఒకవంక నిరసనకారుల నినాదాలు, మరోవంక వాహనాల హారన్ మోతలతో జాతీయ రహదారిపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంటలు వ్యాపించకుండా పోలీసులు అప్పటికప్పుడు నివారణ చర్యలు చేపట్టారే గానీ.. వాటిని తొలగించలేకపోయారు. అగ్నిమాపక బలగాలకు సమాచారాన్ని ఇచ్చారు.
కిర్ల జగ్గిరెడ్డికి నిరసనగా..
జగ్గంపేటకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు కిర్ల జగ్గిరెడ్డికి వ్యతిరేకంగా నిరసనకారులు నినాదాలు చేశారు. జగ్గిరెడ్డి డౌన్ డౌన్ అంటూ నినదించారు. మూడు రాజధానుల ఏర్పాటును తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ.. ఎమ్మెల్యే మాత్రం పట్టించుకోవట్లేదని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి అడుగులకు మడుగులొత్తుతూ పాదసేవ చేస్తున్నారని మండిపడ్డారు. జగ్గిరెడ్డి ఫొటోలను మంటల్లో తగులబెట్టారు. మూడు రాజధానుల బిల్లుకు అనుకూలంగా ఓటు వేయబోతున్న తమ ఎమ్మెల్యేను నియోజకవర్గంలో తిరగనివ్వబోమని హెచ్చరించారు.