కవితకు సొంత ఇలాకాలో ఝలక్, కారును అడ్డుకొని...
నిజామాబాద్: తెరాస ఎంపీ కల్వకుంట్ల కవిత కారుకు ఆసరా ఆందోళన బ్రేకులు వేసింది. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ తమకు పింఛను మంజూరు కాలేదని మహిళలు, వృద్ధులు కవిత వాహనాన్ని అడ్డుకున్నారు. శనివారం నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలం చింతలూరు గ్రామంలో విద్యుత్ ఉపకేంద్రం శంకుస్థాపనకు వెళ్తున్న ఎంపీ వాహనశ్రేణిని కలిగోట్ గ్రామంలో అడ్డుకున్నారు.
నిజామాబాద్ జిల్లా చింతలూరు ప్రాంతంలో ఏర్పాటుచేస్తున్న సబ్ స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు శనివారం ఆమె బయలుదేరారు. జక్రాన్పల్లి మండలం కలిగోడ్ గ్రామంలో ఆమె కాన్వాయ్ని గ్రామస్థులు అడ్డుకున్నారు. తమగోడు వినాలని డిమాండ్ చేశారు. సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాంతో కవిత కారు దిగి వారి వద్దకు వచ్చారు. కొందరు అర్హులకు ఆసరా అందని మాట నిజమేని ఆమె అంగీకరించారు.
వారం రోజులు గడిస్తే, అంతా సరిదిద్దుతానని చెప్పారు. ఎక్కడ తప్పు జరిగిందో గుర్తించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అప్పుడుగానీ ఎంపీకి వారు దారి వదలలేదు. దాదాపు 150 మంది ఆమెను అడ్డుకున్నారు. కాగా, పంపిణీలో ప్రోటోకాల్ పాటించలేదంటూ మెదక్లో ఎంపీ బీబీ పాటిల్ని కాంగ్రెస్ నేతలు అడ్డుకొన్నారు. పింఛన్లను పంపిణీ చేసేందుకు జహీరాబాద్ ఎంపీ పాటిల్ శనివారం పెద్ద శంకరంపేటకు వచ్చారు.
ఎంపీపీ సంజీవరెడ్డిని అవమానించారని, ఆయన పేరును ఫ్లెక్సీలో వేయలేదంటూ కాంగ్రెస్ నేతలు.. సభలో గొడవకు దిగారు. కార్యక్రమం ముగించుకొని వెళుతున్న ఎంపీ కారుని కాంగ్రెస్ నేతలు కొద్దిసేపు అడ్డుకొన్నారు. రద్దయిన పింఛన్లను తిరిగి ఇవ్వాలంటూ వరంగల్ జిల్లా కేసముద్రం మండలం కాట్రపల్లిలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మని వృద్ధులు దగ్ధం చేశారు.
కొత్త జాబితాలో తమను చేర్చేదాకా పాత పింఛన్లు పంచనీయమంటూ మెదక్ జిల్లా తూప్రాన్ మండలం కిష్టాపూర్లో వృద్ధులు, వికలాంగులు పంపిణీని అడ్డుకొని అధికారులను వెనక్కి పంపారు. పింఛన్లు పంపిణీ చేస్తున్నారని తెలిసి వెళ్లిన వికలాంగుడు జాబితాలో పేరు లేకపోవడంతో కుప్పకూలిపోయాడు.
రంగారెడ్డిజిల్లా మర్పల్లి మండలం పట్లూర్కు చెందిన కపిడేవాలా గోరొద్దీన్కు గతంలో పింఛను వచ్చేది. ఇటీవల తీసేశారు. అన్ని దరఖాస్తులు, ధ్రువీకరణ పత్రాలు సమర్పించిన గోరొద్దీన్ కొత్త జాబితాలో పేరు తప్పక ఉంటుందని అనుకున్నాడు.
అలా జరగకపోవడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. పంపిణీని ఆపాలంటూ కరీంనగర్ జిల్లా మల్హర్ మండలం పెద్దతూండ్లలో గ్రామ కార్యదర్శిని గ్రామస్థులు అడ్డుకొని వెనక్కి పంపారు.రంగారెడ్డి జిల్లా యాలాల మండలం కమాల్పూర్ గ్రామానికి చెందిన వితంతువు శాకమ్మ (35) పింఛను రాలేదని ఇంట్లో దూలానికి ఉరి వేసుకొంది.