ఎంపీ గల్లా చొక్కా చించివేత..అరెస్ట్ : అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత..లాఠీ ఛార్జ్: దూసుకొచ్చిన మహిళలు..!
ఒక వైపు అసెంబ్లీ సమావేశం కొనసాగుతోంది. బయట మాత్రం ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఛలో అసెంబ్లీకి అనుమతి లేదంటూ అమరావతి జేఏసీ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసారు. ఎవరూ అసెంబ్లీ పరిసరాల్లోకి రాకుండా పెద్ద ఎత్తున పోలీసులు మొహరించారు. అసెంబ్టీ ప్రారంభం కాగానే..స్థానిక గ్రామాల రైతులు..మహిళలు పొలాల్లో నుండి ముళ్ల కంచెలను దాటుకుంటూ సచివాలయం వెనుక ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. మండదం పొలాల్లో నుండి అసెంబ్లీ గేటు వద్దకు చేరుకున్నారు.
ఆ మార్గం ద్వారా వస్తారని అంచనా వేయలేకపోయినా పోలీసులు చివరి నిమిషంలో వారిని కట్టడి చేసేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో లాఠీఛార్జ్ చేసారు. అసెంబ్లీ ముట్టడికి వచ్చిన ఎంపీ గల్లా జయదేవ్ ను అడ్డుకొనే క్రమంలో ఆయన చొక్క చినిగింది. ఎంపీని పోలీసులు అరెస్ట్ చేసారు. పరిస్థితి ఉద్రిక్తగా మారటం తో విజయవాడ నుండి మరో రెండు బస్సుల్లో అదనపు బలగాలను సచివాలయం వద్దకు తరలించారు.
అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత..
వైసీపీ ప్రభుత్వ మూడు రాజధానుల నిర్ణయానికి నిరసనగా చేపట్టిన అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. అసెంబ్లీ ముట్టడికి రైతులు భారీగా తరలివచ్చారు. అసెంబ్లీ కాంప్లెక్స్ను నలువైపులా చుట్టుముట్టారు. రైతులు, నేతలపై పోలీసులు విరుచుకుపడ్డారు. అసెంబ్లీ పరిసరాల్లో రైతులపై లాఠీఛార్జ్ చేశారు. ఈ క్రమంలో రైతులకు మద్దతుగా వచ్చిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్పై కూడా పోలీసులు అడ్డుకొనే ప్రయత్నం చేసారు. ఆ సమయంలో పోలీసులతో జరగిని పెనుగులాటతో గల్లా చొక్కా చినిగిపోయింది.
సచివాలయంలోకి దూసుకెళ్లేందుకు రైతులు
పోలీసుల ఆంక్షలు లెక్కచేయకుండా సచివాలయంలోకి దూసుకెళ్లేందుకు రైతులు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినా సాధ్యం కాకపోవటంతో లాఠీఛార్జ్ కు దిగారు. పలువురికి గాయాలయ్యాయి. సచివాలయం ఎదురుగా ఉన్న పంట కాల్వలోకి దిగి రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అమరావతికి మద్దతుగా నినాదాలు చేస్తున్నారు. వారిని అక్కడ నుండి తరలించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.
అసెంబ్లీ ముట్టడికి భారీగా స్థానికులు..
అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత కొనసాగుతోంది. అక్కడ రైతులు..తమ గ్రామస్తుల పైన పోలీసులు లాఠీచార్జ్ చేసారనే విషయం తెలుసుకుని.. అసెంబ్లీ ముట్టడికి భారీగా రైతులు తరలివస్తున్నారు. అసెంబ్లీ కాంప్లెక్స్ను నలువైపులా రైతులు చుట్టుముట్టారు. దీంతో రైతులపై పోలీసులు విరుచుకుపడుతున్నారు. అసెంబ్లీ పరిసరాల్లో పోలీసులు లాఠీఛార్జ్కి దిగారు. మరోవైపు పోలీసుల ఆంక్షలు తెంచుకుని రైతులు నలువైపులా సచివాలయాన్ని ముట్టడించారు. సచివాలయం మెయిన్ గేట్ దగ్గరకు రాజధాని రైతులు చేరుకున్నారు.
పోలీసులు అడ్డుకున్నారు
రైతులు సచివాలయంలోకి దూసుకెళ్లేందుకు యత్నించారు. అయితే వీరిని పోలీసులు అడ్డుకున్నారు. రైతులు, పోలీసులు మధ్య తోపులాట జరిగింది. సమయం గడిచే కొద్దీ రైతులు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో..విజయవాడ నుండి రెండు బస్సుల్లో అదనపు బలగాలను అసెంబ్లీకి తరలించారు. రైతులు మాత్రం అసెంబ్లీలో జరుగుతున్న నిర్ణయాలు..పోలీసుల తీరు పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.