పశ్చిమ గోదావరి డీడీఆర్సీ సమావేశంలో ప్రోటోకాల్ రగడ .. పేర్నినానీ వర్సెస్ రఘురామ కృష్ణం రాజు
పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీ ఎంపీలకు డీడీ ఆర్ సి సమావేశంలో సముచిత స్థానం ఇవ్వలేదని, ప్రోటోకాల్ పాటించలేదని రగులుకున్న వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య ఉన్న విభేదాలను తేటతెల్లం చేస్తుంది. పశ్చిమగోదావరి జిల్లాలోని డి డి ఆర్ సి సమావేశంలో వేదిక పై వైసీపీ ఎంపీలకు సీట్లు కేటాయించలేదని ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేసి సమావేశం నుంచి వెళ్లిపోయారు. అధికార పార్టీ నేతల మధ్య నెలకొన్న ప్రోటోకాల్ వివాదం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.
డిడి ఆర్ సి మీటింగ్ లో వేదికపై సీట్లు కేటాయించకపోవటంతో ఎంపీలు వాకౌట్
ఏలూరు కలెక్టరేట్ సమావేశమందిరంలో జరిగిన డిడి ఆర్ సి మీటింగ్ లో హాజరైన ఎంపీలకు వేదికపై సీట్లు కేటాయించలేదు .జిల్లా ఇన్చార్జి మంత్రి పేర్ని నాని స్వయంగా ఎంపీలకు ముందువరుసలో సీట్లు కేటాయించాలని చెప్పడం జరిగింది. దీంతో ప్రోటోకాల్ పాటించలేదని తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు సమావేశం నుండి వాకౌట్ చేశారు. ఇక ఆయన తరువాత ఏలూరు ఎంపీ శ్రీధర్, రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ ఇద్దరూ కూడా సమావేశం నుండి వెళ్లిపోయారు.
అవమానించారని ఎంపీల ఆవేదన .. ప్రోటోకాల్ ప్రకారమే సమావేశం జరిగిందన్న నానీ
ప్రోటోకాల్ పాటించకుండా ఎంపీలకు అవమానం చేశారని సమావేశం నుంచి వెళ్లిపోయిన ఎంపీలు పేర్కొనగా దీనిపై మంత్రి పేర్ని నాని స్పందించారు. ప్రోటోకాల్ ప్రకారం ఈ సమావేశం నిర్వహించామని, ఒకవేళ పాటించలేదని నిరూపిస్తే క్షమాపణ చెబుతానని పేర్కొన్నారు. అయితే డీడీఆర్ సి సమావేశంలో ఎంపీలకు కనీస గౌరవం లేకపోవడం అది వ్యక్తిగతంగా తనకు జరిగిన అవమానం కాదని, పార్లమెంటరీ వ్యవస్థ అవమానించడమేనని అభిప్రాయం వ్యక్తం చేశారు ఎంపీ రఘురామకృష్ణంరాజు.
సీఎం దృష్టికి, లోక్ సభ స్పీకర్ దృష్టికి తీసుకెళ్తామన్న ఎంపీ
అంతేకాదు ఈ పరిణామాలను సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని, లోక్సభ స్పీకర్ దృష్టికి కూడా తీసుకు వెళ్తామని పేర్కొన్నారు. ఇలాంటి పొరపాట్లను సరిదిద్దుకునే వరకు ఎలాంటి సమావేశాలకు హాజరు కామని గట్టిగానే చెప్పారు రఘురామ కృష్ణంరాజు. ఒకపక్క పేర్ని నాని మాత్రం మూడు దఫాలుగా తాను ఎమ్మెల్యేగా ఉన్నానని, ఎలాంటి ప్రోటోకాల్ ఉల్లంఘన జరగలేదని తేల్చి చెప్పారు.
అధికార పార్టీ నేతల మధ్య వివాదం .. బయటపడిన అంతర్గత కలహాలు
అంతేకాదు ఈ సమావేశాల్లోనే అసహనం వ్యక్తం చేసిన ఎంపీలకు మీరు కేంద్ర మంత్రులు అయితే మీకు వేదికపై సముచిత స్థానం కల్పిస్తామని పేర్ని నాని పేర్కొన్నారు. ఇక అధికార పార్టీకి సంబంధించిన నేతల మధ్య నెలకొన్న ప్రోటోకాల్ వివాదం పార్టీలో ఉన్న అంతర్గత వివాదాలను బహిర్గతం చేస్తుంది. జిల్లాలో మంత్రులకు, నేతలకు మధ్య సయోధ్య లేదు అన్న విషయం తేటతెల్లం చేస్తుంది. పశ్చిమగోదావరి జిల్లా నాయకుల మధ్య నెలకొన్న ఈ ప్రోటోకాల్ వివాదం భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో వేచి చూడాలి.