విజయసాయిరెడ్డి ట్వీట్లపై స్పందించడం అనవసరం: సుజనా చౌదరి
అమరావతి: రాజధాని ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ వారే అత్యధికంగా భూములు కొనుగోలు చేశారని వైసీపీ ఆరోపణలు చేస్తోంది. ఇక్కడ భూములు కొన్న వారిలో ప్రస్తుత బీజేపీ ఎంపీ అప్పటి టీడీపీ ఎంపీ సుజనా చౌదరీపై మంత్రి బొత్స తీవ్ర ఆరోపణలు చేశారు. సుజనా చౌదరి కుటుంబ సభ్యులు, బంధువులు రాజధాని ప్రాంతంలో భూములు కొన్నారని బొత్స బహిరంగంగా వ్యాఖ్యానించారు. దీనిపై సుజనా చౌదరి స్పందించారు. తన పేరు మీద భూములు ఉంటే రుజువు చేయాలంటూ సవాల్ విసిరారు.
ఇక వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయ్ సాయి రెడ్డి కూడా సుజనా చౌదరిపై ఆరోపణలు చేశారు. సుజనా చౌదరి బ్యాంకులకు రూ.6వేల కోట్లు ఎగ్గొట్టి ఈడీకి అడ్డంగా దొరికిన తర్వాత కూడా ఇలానే అడ్డంగా దబాయించాడని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.ఆ కంపెనీలతో తనకెలాంటి సంబంధం లేదని బుకాయించాడని విజయసాయి రెడ్డి అన్నారు. ఇప్పుడు కూడా అమరావతిలో సెంటు భూమి కూడా లేదని బుకాయిస్తున్నాడని విజయసాయి రెడ్డి ధ్వజమెత్తారు. మోసాలు చేయడంలో సుజనాచౌదరి ఆరితేరి పోయాడని చెప్పిన విజయసాయి రెడ్డి.... చంద్రబాబుకు హృదయ కాలేయంగా మారాడని విమర్శించారు.
విజయసాయి రెడ్డి ట్వీట్లపై స్పందించారు ఎంపీ సుజనా చౌదరి. తనపై చౌకబారు ఆరోపణలు చేయడం మానుకుని... రాష్ట్ర ప్రజలకు పనికొచ్చే పనులు చేయాలని సూచించారు. విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు రాష్ట్రానికి నష్టం చేకూర్చేలా ఉన్నాయని మండిపడ్డారు. విజయసాయి రెడ్డి స్థాయి మరిచి దిగజారి ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సుజనా చౌదరి. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడినట్లు తనపై వైసీపీ నేతలు ఆరోపణలు చేశారని దమ్ముంటే రుజువు చేసి తనపై కేసులు నమోదు చేయాలని సవాల్ విసిరారు. ఇక విజయసాయిరెడ్డి చేస్తున్న నాసిరకం ట్వీట్లపై తాను స్పందించనని చెప్పారు. 2013 తర్వాత తాను ఎక్కడైనా భూములు కొన్నట్లు ఉంటే రుజువు చేయాలని సవాల్ విసిరారు. ఒకవేళ అన్యాయంగా ఎక్కడైనా భూములు కొన్నట్లు ఉంటే తను ఎలాంటి విచారణకైనా సిద్ధమని సుజనా చౌదరి స్పష్టం చేశారు.