జర్నలిస్టుల ఆరోగ్య భద్రత గురించి ఆలోచించండి: తెలుగు రాష్ట్రాలకు పవన్ కళ్యాణ్
హైదరాబాద్/అమరావతి: కరోనావైరస్ విపత్కర పరిస్థితుల్లోనూ ధైర్యంగా విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులకు ఆరోగ్య బీమా కల్పించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని జర్నలిస్టులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ.. ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తున్నారని ప్రశంసించారు.
తెలంగాణలో కొన్ని చోట్ల జర్నలిస్టులు క్వారంటైన్ కు వెళ్లినట్లు తెలిసిందని పవన్ కళ్యాణ్ చెప్పారు. పాత్రికేయులు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ విధులు చేపట్టాలని పవన్ కళ్యాణ్ సూచించారు. మన పొరుగున ఉన్న తమిళనాడులో 25 మంది, ముంబైలో 50 మందికిపైగా జర్నలిస్టులు కరోనా బారిన పడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఇలాంటి పరిస్థితుల్లో జర్నలిస్టులకు అవసరమైన ఆరోగ్య భద్రత, బీమా కల్పించే విషయమై రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని జనసేనాని సూచించారు. జర్నలిస్టు సంఘాలు, మీడియా సంస్థలు జర్నలిస్టుల ఆరోగ్య రక్షణకు తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు. కరోనా విపత్కర సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలను ఆదుకుంటున్న జనసైనికులను ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అభినందించారు.
ఇది ఇలావుడంగా, కరోనా విపత్కర సమయంలో రాజకీయాలు తగదంటూ పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఏపీ ప్రభుత్వానికి సూచించారు. ఆంధ్రప్రదేశ్ లో కరోనా నివారణపై కంటే రాజకీయ ప్రత్యర్థులపైనా కొందరు అధికార పార్టీ పెద్దలు దృష్టి పెట్టినట్లు గత రెండు మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలు తెలియచేస్తున్నాయన్నారు.