ఎమ్మెల్యేలు కాంగ్రెసును వీడరు, పీఆర్పీ అంతే: చిరంజీవి
న్యూఢిల్లీ: తన ప్రజారాజ్యం పార్టీని పునరుద్ధరించే ఆలోచన లేదని కేంద్ర మంత్రి, కాంగ్రెసు నాయకుడు చిరంజీవి స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని పునరుద్ధరిస్తారనే ఊహాగానాలు చెలరేగాయి. ఈ ఊహాగానాలకు చిరంజీవి తెర దించారు. తాను సమైక్యవాదానికే కట్టుబడి ఉన్నానని, అయితే విభజన అనివార్యమైతే తాను తెలంగాణ ముసాయిదా బిల్లులో సవరణలు ప్రతిపాదిస్తానని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ప్రవాస భారతీయ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. కేంద్ర మంత్రిగా కాకుండా సినీ నటుడిగానే తాను ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు.
హైదరాబాద్తోనే అందరి ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయని, హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా (యుటిగా) చేస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆయన అన్నారు. హైదరాబాద్ను యుటిగా చేయాలని తాను ప్రతిపాదించనున్నట్లు ఆయన తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరగాలంటే భద్రచలాన్ని సీమాంధ్రలో కలపాలని ఆయన అన్నారు.
తెలంగాణ ముసాయిదా బిల్లుపై శాసనసభలో చర్చ జరిగితేనే బాగుంటుందని, చర్చ జరిగితేనే సీమాంధ్రకు న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. శాసనసభలో చర్చ జరగకుండా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు అడ్డుకుంటున్నారని ఆయన అన్నారు. పార్లమెంటులో సమైక్యాంధ్ర కోసం తాను పోరాటం చేస్తానని ఆయన చెప్పారు.
రాష్ట్ర విభజనకు అనుకూలంగా అన్ని పార్టీలూ లేఖలు ఇచ్చాయని, ఇప్పుడు రాజకీయ ప్రయోజనం కోసం కొన్ని పార్టీలు ద్వంద్వ వైఖరి అవలబించడం దురదృష్టకరమని ఆయన అన్నారు. తన వర్గానికి చెందిన శాసనసభ్యులు కాంగ్రెసు వీడుతారనే వార్తలను ఆయన ఖండించారు. ఎవరూ కాంగ్రెసు పార్టీని వీడరని ఆయన అన్నారు.