జగన్ ఆగ్రహం: అనుచిత వ్యాఖ్యలు, ఆడియో టేపులు: ఎస్వీబీసీ ఛైర్మన్ పదవికి పృథ్వీ రాజీనామా!
అమరావతి: ఎస్వీబీసీ ఛైర్మన్ పృథ్వీ రాజ్పై వేటు పడింది. రైతులపై అనుచిత వ్యాఖ్యలు, ఆడియో టేపుల వ్యవహారం ఆయనపై వేటుకు కారణమయ్యాయి. వివాదాలు చుట్టుముట్టడంతో టీటీడీ సీరియస్ అయ్యింది. ఈ క్రమంలో పృథ్వీని రాజీనామా చేయాలంటూ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
ఎస్వీబీసీ ఛైర్మన్ పదవికి రాజీనామా
తనపై వచ్చిన ఆరోపణలు, టీటీడీ ఆదేశాల నేపథ్యంలో పృథ్వీ ఎస్వీబీసీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే, ఇప్పటికే రాజీనామా చేసినట్లు సమాచారం. అమరావతి రాజధాని కోసం ఆందోళన చేస్తున్న రైతులను పృథ్వీరాజ్ ఇంతకుముందు పెయిడ్ ఆర్టిస్టులంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతేగాక, తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, తన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. అయితే, ఆయన వ్యాఖ్యలను మరో సినీనటుడు, వైసీపీ మద్దతుదారుడు పోసాని కృష్ణమురళీ ఖండించారు.
మహిళ ఉద్యోగులతో అసభ్యంగా..
ఆ తర్వాత పృథ్వీ రాజ్.. ఎస్వీబీసీ మహిళా ఉద్యోగితో అసభ్యంగా మాట్లాడినట్లు ఆడియో టేపులు బయటపడ్డాయి. అంతేగాక, పలురువు మహిళా ఉద్యోగినులతో ఆయన అసభ్యంగా ప్రర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన స్పందించారు.
పృథ్వీ వివరణ
తాను మహిళలపై అసభ్యంగా ప్రవర్తించినట్లు, మాట్లాడినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని పృథ్వీరాజ్ తెలిపారు. ఆడియో టేపులో ఉన్నది తన వాయిస్ కాదని, తనపై కుట్ర జరుగుతోందని అన్నారు. తాను మహిళల పట్ల గౌరవంగా నడుచుకుంటానని చెప్పారు. విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని ఆయన అన్నారు.
సీఎం జగన్ ఆగ్రహం.. పృథ్వీపై వేటు
కాగా, పృథ్వీపై టీటీడీ విజిలెన్స్ కమిటీ ఎస్వీబీసీలో విచారణ జరిపింది. మహిళలతో అసభ్యంగా మాట్లాడిన ఆడియో టేపులపై విచారణ జరిపి ఆ నివేదికను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి అందించారు. ఆ నివేదికను ఆయన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అందించారు. దీంతో పృథ్వీ ఆడియో టేపుల వ్యవహారంపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పృథ్వీని ఎస్వీబీసీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేయాలంటూ టీటీడీ ఛైర్మన్ ఆదేశాలు చేశారు. ఈ క్రమంలోనే పృథ్వీ ఆ పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం.