టీడీపీలో తాజా సర్వే ప్రకంపనలు, చంద్రబాబు ఓకే, ఎమ్మెల్యేల్లో కొందరే పాస్, ఈసారి అధికారం కష్టమేనా?
తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం ఓ సర్వే నివేదిక దుమారం రేపుతోంది. చంద్రబాబు నాయుడు దేశంలోని ఓ ప్రముఖ సెఫాలజిస్ట్ చేత ఈ సర్వే చేయించారట.
అమరావతి: చంద్రబాబుకు 76 శాతం మార్కులు.. ఆయన పార్టీలోని ఎమ్మెల్యేలలో కొంతమందికి మాత్రమే పాస్ మార్కులు రాగా.. మరికొందరికి కేవలం 20 శాతం మార్కులే వచ్చాయి.
అరె.. ఈ మార్కుల గోలేంటి? వీళ్లేమైనా పరీక్షలు రాశారా? అని అయోమయంలో పడ్డారా? అదేం లేదులెండి.. దేశంలో ఓ ప్రముఖ సెఫాలజిస్ట్ ( రాజనీతిజ్ఞడు) నిర్వహించిన సర్వేలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఆయన సహచరులకు వచ్చిన మార్కులట.
చంద్రబాబు సంచలన నిర్ణయం.. కీలక నేత సస్పెన్షన్, మొదలైన నిరసనల సెగ
ఇటీవల సర్వే నిర్వహించిన ఈ సెఫాలజిస్ట్ ఇప్పటికే దీనికి సంబంధించిన నివేదికను చంద్రబాబు నాయుడికి సమర్పించారట. ఆ సర్వే నివేదికలో వెల్లడైన నిజాలివి! ఇప్పడా నివేదిక విషయమే తెలుగుదేశం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.
మూడేళ్ల పాలనపై బాబు సర్వేలు...
ముచ్చటగా మూడు సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన పాలనపై సర్వేలు చేయించుకుంటున్నారు. ఇప్పటికే ఐవిఆర్ఎస్ సర్వేతో పాటు, కాల్సెంటర్ ద్వారా సర్వేలు చేయించుకున్న ముఖ్యమంత్రి వాటితో సంతృప్తి చెందలేదట. అందుకే ఓ ప్రముఖ సెఫాలజిస్ట్ చేత రాష్ర్టంలో తన పాలనపై సవివరమైన సర్వే చేయించారట.
Recommended Video
క్షేత్ర స్థాయిలో.. ఎక్కువ శాంపిల్స్ తో...
ఈ సర్వేలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు పనితీరు.. ఎమ్మెల్యేల పనితీరుపై క్షేత్రస్థాయిలో ఎక్కువ శాంపిల్స్తో సర్వే చేయించారు. ఈ సర్వేను దేశంలోని ఓ ప్రముఖ సెఫాలజిస్టు నిర్వహించారనే ప్రచారం జరుగుతోంది.. ఈ సర్వేలో వచ్చిన ఫలితాలు కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఎమ్మెల్యేలలో కూడా చర్చకు దారి తీస్తున్నాయి.. ప్రభుత్వ పథకాల అమలు.. పెన్షన్లు అందుతున్న వైనం... ఆయా కుటుంబాలకు ఎలాంటి లబ్ధి చేకూరుతోంది..? అనే అంశాలపై ఈ సర్వే చేయించారు.
మళ్లీ చంద్రబాబుకే ‘ఓటు'...
రాష్ర్టంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో చంద్రబాబు సీఎంగా ఉంటేనే మేలు జరుగుతుందని ఈ సర్వేలో చాలా మంది అభిప్రాయపడ్డారట! అసలే ఆర్ధికలోటుతో ఉన్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం సమర్థుడైన చంద్రబాబు వల్లే సాధ్యమవుతుందని.. ఆయనే సరైన నాయకుడని... బాగా కష్టపడుతున్నారంటూ ఎక్కువ మంది ఈ సర్వేలో చెప్పినట్లు తెలిసింది.. ఇలా ఈ సర్వేలో చంద్రబాబుకు 76 శాతం మార్కులు వచ్చాయని చెబుతున్నారు.
సిట్టింగుల ఖేల్ ఖతం...?
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పనితీరుతో పోల్చుకుంటే.. ఆయన ప్రభుత్వంలోని ఎమ్మెల్యేల పనితీరు మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉందట! దాదాపుగా అరవై శాతం మంది ఎమ్మెల్యేలపై ఈ సర్వేలో ప్రజలు వ్యతిరేకత కనబరిచారట! దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేల ఖేల్ ఖతమైనట్లే అనే చర్చ జరుగుతోంది. విచిత్రం ఏమిటంటే... ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉన్న ఎమ్మెల్యేల స్థానంలో కొత్తవారిని నిలబెట్టినా కొందరు గ్యారంటీగా ఓడిపోతారని ఈ సర్వే నివేదిక తేల్చేసిందట.
హెచ్చరికలు ఉండవు.. ఇక ఉద్వాసనలే...
ఈ సర్వే నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో పరిశీలించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పనితీరు సంతృప్తికరంగా లేని ఎమ్మెల్యేలను మళ్లీ ఒకసారి పిలిపించి మాట్లాడాలని ఆయన నిర్ణయించుకున్నట్లు సమాచారం. అప్పటికీ ఎమ్మెల్యేలు తమ పనితీరు మెరుగుపర్చుకోకపోతే అలాంటి వారికి ఉద్వాసన పలకాలని కూడా ఆయన గట్టిగా డిసైడయ్యారట.
ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ డోస్.. ఫైనల్ వార్నింగ్...
నిజానికి పనితీరు సరిగ్గా లేని ఎమ్మెల్యేలను ఇప్పటికే చాలాసార్లు హెచ్చరించారు చంద్రబాబు. సమావేశాల్లోనూ, పార్టీ వర్క్షాపుల్లోనూ, అంతర్గత సమావేశాల్లోనూ స్ట్రాంగ్ డోస్ ఇచ్చారు. ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో మరో ఆర్నెల్లలో పనితీరు మార్చుకోవాలని ఫైనల్ వార్నింగ్ కూడా ఇచ్చారట. అప్పటికీ వారిలో మార్పు రాకపోతే ఉద్వాసన పలికి ప్రత్యామ్నాయ నాయకత్వాలను ఆయా నియోజకవర్గాలలో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.
పెన్షన్ పంపిణీయే గట్టెక్కించింది...
చంద్రబాబు నాయుడు చేయించిన ఈ సర్వేలో పెన్షన్ పంపిణీపై సర్కారుకు లబ్ధిదారులు మంచి మార్కులు వేశారు. ఈ విషయంలో 95 శాతం వరకు లబ్ధిదారులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు సర్వే నివేదిక పేర్కొంది. ప్రతి నెలా క్రమం తప్పకుండా పెన్షన్ డబ్బులు అందుతున్నాయని.. మందులు కొనుక్కునేందుకు సరిపోతున్నాయంటూ సర్వేలో పాల్గొన్న వారు చెప్పుకొచ్చారట.
‘అవినీతి' కొంపముంచనుందా?
ఈ సర్వేలో రుణమాఫీపై కొంతమంది రైతులు పెదవి విరవగా, ఎక్కవ మంది అవినీతి పెరిగిందంటూ అభిప్రాయపడ్డారట. ఎమ్మెల్యేల అవినీతిపైనే ఎక్కువ మంది అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సర్వే నివేదిక పేర్కొందట. ఈ విషయాన్ని కూలంకషంగా పరిశీలించిన చంద్రబాబు ఇక పొలిటికల్ మేనేజ్మెంట్పై దృష్టి పెట్టారు.
బాబు కళ్లు తెరిపించిన సర్వే?
సెఫాలజిస్ట్ చేత చేయించిన సర్వే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కళ్లు తెరిపించింది. దీంతో ఆయన ప్రతి మంగళవారం ఉదయం పార్టీ, ప్రభుత్వ పెద్దలతో సమావేశమై పార్టీ వ్యవహారాలను చక్కదిద్దుతున్నారు. జిల్లాల పర్యటనలకు వెళుతున్నారు. నేతలందరినీ కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. మొత్తానికి సెఫాలజిస్ట్ సర్వేతో చంద్రబాబునాయుడి కళ్లు తెరుచుకున్నాయి. పార్టీకి, ప్రభుత్వానికి అవసరమైన మరమ్మతులు చేసే పనిలో ఆయన ఇప్పుడు బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.