బాలికపై ఇంజెక్షన్ సైకో దాడి, వాడెవడు.. సూది గుచ్చి పోతున్నాడు, రంగంలోకి దిగుతా: బాబు
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో ఇంజెక్షన్ సైకో రెచ్చిపోతున్నాడు. శుక్రవారం నాడు కూడా ఆ సైకో నరసాపురంలో ఇంజెక్షన్తో దాడికి పాల్పడ్డాడు.
నరసాపురంలోని జగన్నాథస్వామి ఆలయం వద్ద నాలుగో తరగతి చదువుతున్న ఏడేళ్ల బాలికకు ఇంజెక్షన్ గుచ్చి పరారయ్యాడు. బాలికను స్థానికులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సైకోను పట్టుకునేందుకు ముమ్మర ప్రయత్నం చేస్తున్నారు.
ఇంజెక్షన్ వల్ల కొందరుకు వాంతులు కూడా అవుతున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు, కలకలం సృష్టిస్తున్న ఇంజక్షన్ ఉన్మాది ఊహాచిత్రాన్ని పోలీసులు విడుదల చేశారు.
గురువారం ఉదయం డీఎస్పీ సౌమ్యలత ఉన్మాది ఊహాచిత్రాన్ని విడుదల చేశారు. ఇప్పటి వరకూ పదమూడు మంది మహిళలలు, యువతుల పైన ఉన్మాది ఇంజక్షన్తో దాడి చేశాడు. ఉన్మాది కోసం పోలీసు బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి.
వాడెవడండీ.. సూది గుచ్చి పారిపోతున్నాడు: చంద్రబాబు
ఇంజెక్షన్ సైకో పైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం స్పందించారు. చంద్రబాబు విజయవాడలో నిర్వహించిన సమీక్ష సమావేశం ముగిసిన అనంతరం సైకో పైన విలేకరులు అడగగానే చంద్రబాబు నవ్వేశారు. ఆయన అరుదుగా నవ్వుతుంటారు.
వాడెవడండీ, సూది గుచ్చి పారిపోతున్నాడు.. అంటూ ముసిముసిగా నవ్వాడు. ఆ వెంటనే సైకోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సైకో విషయమై ఎస్పీకి సూచనలు ఇచ్చినట్లు చెప్పారు. సైకోను పట్టుకోవడం చేతకాకపోతే తానే రంగంలోకి దిగుతానని హెచ్చరించినట్టు చెప్పారు.
సైకోను పట్టుకునేందుకు 40 బృందాలను నియమించి, ప్రయత్నిస్తున్నారని ఆయన వెల్లడించారు. సైకో చేస్తున్న నేరం తీవ్రమైనదా? కాదా? అన్నది వేరే విషయమని పేర్కొన్న ఆయన, పోలీసులు ఎంత త్వరగా రక్షణపై భరోసా ఇస్తున్నారన్నది పట్టుకోవడం ద్వారా నిర్ధారణ అవుతుందని తెలిపారు. తక్షణం సైకోను పట్టుకోవాలని ఆయన ఆదేశించారు.