న్యూ ఇయర్ పార్టీ: రూ.400 చెల్లిస్తే.. తాగినోళ్లకు తాగినంత, ఆడినోళ్లకు ఆడినంత..
విశాఖపట్నం: రూ. 400 టిక్కెట్.. తాగినోళ్లకు తాగినంత.. ఆడినోళ్లకు ఆడినంత.. స్పెషల్ అట్రాక్షన్ యాంకర్లు.. అంటూ ప్రచారం చేయడంతో జనం ఎగబడిపోయారు. ఇరుకైన గదిలో అర్థరాత్రి వరకు మందుకొట్టి చిందులేశారు.
ఇది జరిగింది ఎక్కడో కాదు.. పలాసలో. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పలాస-కాశీబుగ్గలోని ఓ హోటల్ యజమాని విశాఖపట్నం నుంచి యాంకర్లను రప్పించి ఇరుకైన గదిలో వేడుకలు నిర్వహించడం చర్చనీయాంశమైంది.
కొత్త సంవత్సరం వేడుకల్లో ఎలాంటి ఈవెంట్లకూ పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా ఈ ఈవెంట్ యధేచ్ఛగా నడవడం గమనార్హం. అన్ లిమిటెడ్ ఫుడ్, డ్రింక్స్, యాంకర్లతో డ్యాన్స్ అంటూ నిర్వాహకులు ప్రకటించడంతో జనం రెచ్చిపోయారు.
జంట పట్టణాలకు చెందిన జీడి వ్యాపారులు, ప్రధాన, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు వచ్చి వాలిపోయారు. సింగిల్ డోర్ మాత్రమే ఉన్న ఈ మండపంలో వందలాది మంది న్యూఇయర్ వేడుకలు జరుపుకున్నారు.
ఇటీవల ముంబైలోని ఓ పబ్లో అగ్నిప్రమాదం సంభవించి పలువురు మృత్యువాత పడిన సంగతి తెలిసినా, ఎటువంటి గుణపాఠం నేర్చుకోకుండా న్యూ ఇయర్ వేడుకల పేరుతో ఇలాంటి ఈవెంట్లు నిర్వహించడం ఆందోళన కలిగిస్తోంది.
ఈ వేడుకల్లో పాల్గొనే వారికి టోకెన్లు ఇస్తే ప్రచారం జరుగుతుందని భావించి.. నగదు చెల్లించిన వెంటనే చేతిపై ముద్ర వేసి లోపలికి పంపించారు. పార్టీకి వచ్చిన ప్రతి ఒక్కరూ చేతి మీద ముద్ర చూపించి పబ్లోకి అడుగుపెట్టే విధంగా జాగ్రత్త తీసుకున్నారు.
అయితే న్యూఇయర్ వేడుకల్లో యాంకర్లను పిలిపించారనే సమాచారం అందుకున్న కాశీబుగ్గ పోలీసులు అక్కడికొచ్చి వారిని బయటికి పంపించి వేశారు. మొత్తంమీద ఈ పబ్ విష సంస్కృతి పలాసకూ పాకడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.