ఆన్లైన్ రిజర్వేషన్లు ఆరంభం: రోడ్డెక్కనున్న ఆర్టీసీ బస్సులు: వాటికి మినహాయింపు..
అమరావతి: రాష్ట్రంలో ప్రజా రవాణా శాఖ (ఆర్టీసీ) బస్సులు రోడ్డెక్కబోతున్నాయి. ఈ నెల 15వ తేదీ నుంచి పరిమితంగా బస్సు సర్వీసులను పునరుద్ధరించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు బస్సులను నడిపించడం ఖాయంగా కనిపిస్తోన్నప్పటికీ.. ఆంక్షల మధ్య రాకపోకలు సాగించవచ్చని తెలుస్తోంది. అన్ని జిల్లా కేంద్రాలను అనుసంధానించేలా బస్సు సర్వీసులను పునరుద్ధరిస్తారని, అవి పరిమితంగా ఉండొచ్చని అంటున్నారు.
ప్రయాణికులకు శుభవార్త: రైల్వే, విమాన ప్రయాణాలకు టికెట్ల బుకింగ్ ఆరంభం: జర్నీ ఎప్పట్నుంచంటే..!
దీనికి సంబంధించి ఆన్లైన్ ద్వారా టికెట్ల రిజర్వేషన్ల ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. ఈ నెల 14వ తేదీ నాటితో లాక్డౌన్ ముగియనున్నట్లు వార్తలు వస్తోన్న నేపథ్యంలో..రైల్వే, విమానయాన సంస్థలు ఇప్పటికే ముందస్తు టికెట్ల బుకింగ్ జారీ చేయడం చేపట్టిన విషయం తెలిసిందే. తాజాగా ప్రజా రవాణా శాఖ అధికారులు తమ బస్సు సర్వీసులను పునరుద్ధరించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఏసీ బస్సులను టికెట్ల రిజర్వేషన్ నుంచి మినహాయించారని, ప్రస్తుతానికి సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్ బస్సులకు మాత్రమే రిజర్వేషన్లు చేపట్టారని సమాచారం.
పొరుగు రాష్ట్రాలకు బస్సు సర్వీసులను పునరుద్ధరిస్తారా? లేదా? అనేది ఇంకా తేలాల్సి ఉంది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ను పాక్షికంగా ఎత్తేసే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నందున పొరుగు రాష్ట్రాలకు బస్సు సర్వీసులను నడిపించే అవకాశాలు ఉన్నాయనే అంటున్నారు అధికారులు. అంతర్రాష్ట సర్వీసులు, అంతర్ జిల్లాల సర్వీసులను పాక్షికంగా మాత్రమే నడిపిస్తామని, జిల్లాల పరిధిలో మాత్రం అన్ని డిపోల నుంచి సర్వీసులను ప్రారంభిస్తామని అధికారులు వెల్లడిస్తున్నారు.