రెండు సూసైడ్ నోట్స్: పూజిత ఆ రోజు ఏం చేసింది?
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని పంజాగుట్ట ఐఏఎస్ క్వార్టర్స్లో సజీవ దహనమైన వాసిరెడ్డి పూజిత కేసులో పోలీసులు మరింత పురోగతి సాధించారు. రెండు సూసైడ్ నోట్లు ఆమె రాసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దానికి తోడు ఫేస్బుక్లోంచి కొన్ని వివరాలు సేకరించగలిగారు. ఈనెల 20న ఐఏఎస్ క్వార్టర్స్ పార్కులో యువతి సజీవ దహనమైన విషయం తెలిసిందే. మరుసటి రోజు బీహార్కు చెందిన అక్షయ్ ఇచ్చిన సమాచారంతో మృతురాలు పూజితగా గుర్తించిన విషయం గుర్తించారు.
పూజిత తన స్వగ్రామం నుంచి బయలు దేరినప్పటి నుంచి ఘటన జరిగినంత వరకు లభించిన అన్ని క్లూలు పోలీసులు సేకరించినట్లు తెలిసింది. ప్రతి అంశాన్ని క్షుణ్నంగా పరిశీలించిన హైదరాబాద్ వెస్ట్జోన్ పోలీసులు పూజిత మృతిలో వ్యక్తమవుతున్న అనుమానాలను నివృత్తి చేసేందుకు శాస్త్రీయంగా ముందుకెళ్తున్నారు.
మీడియాలో వచ్చిన వార్తాకథనాల ప్రకారం - సీఏ కోర్సు చదువుతున్న పూజిత తన స్వగ్రామం కృష్ణాజిల్లా నందిగామ నుంచి హైదరాబాద్కు బయలు దేరుతూ ఇంట్లో తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ ఒక సూసైడ్ నోట్ రాసింది. తరువాత హైదరాబాద్లో ఆమె స్నేహితుడు అక్షయ్ని కలిసి టీ షర్ట్ను గిప్టుగా ఇచ్చింది. అందులోనూ మరో సూసైడ్ నోట్ పెట్టింది. ఇంట్లో లభ్యమైన సూసైడ్ నోట్ తెలుగులో రాయడం, అక్షయ్కిచ్చిన దాంట్లో ఇంగ్లిష్లో రాసి ఉన్నాయి. ఈ రెండింటి చేతి రాతలు ఆమె పుస్తకాలను పరిశీలించిన అనంతరం అక్షరాల స్ట్రోక్స్ను బట్టి రెండు ఆమె రాసినవేనని గుర్తించారు.
మరోవైపు పూజిత ఫేస్బుక్ ఖాతాను కూడా పోలీసులు పరిశీలించారు. రెండు మూడు సార్లు అక్షయ్తో చాట్ చేసిన ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ విషయాన్ని అక్షయ్ పోలీసులకు ముందే చెప్పాడు. దాంతో అతడు చెప్పింది, ఫేస్బుక్లో విషయాలు సరిపోలినట్లు తెలిసింది.
ఆ రోజు ఏం చేసింది..
పూజిత స్వగ్రామం నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చిన తరువాత స్నేహితుడు అక్షయ్తోకలిసి షాపింగ్ చేసింది. భోజనం అనంతరం రాత్రి 10.30 గంటల సమయంలో సికింద్రాబాద్లో అక్షయ్ ఆమెను బైక్పై డ్రాప్ చేశాడు. స్థానికంగా లభ్యమైన సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా ఈ విషయాన్ని పోలీసులు నిర్ధారించుకున్నారు. పంజాగుట్ట ఏరియాపై పూజితకు అవగాహన ఉన్నట్లు తెలిసింది.
ఎస్ఆర్నగర్లో గతంలో సీఏ కోర్సు శిక్షణ కోసం ఉంది. ఆ సమయంలో పంజాగుట్ట లో ఆమె తిరగడంతో పరిసరాలపై అవగాహన ఉందని పోలీసులు అభిప్రాయానికి వచ్చారు. చదువుకునేందుకు ఐఏఎస్ క్వార్టర్స్లోని పార్కుకు కూడా వెళ్లినట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసినట్లు సమాచారం. అగ్గిపెట్టే కొనుగోలు చేసినట్లు పంజాగుట్టలోని ఒక పాన్షాప్ నిర్వాహకుడు వాంగ్మూలం ఇచ్చాడు. ఇలా పోలీసులు అన్ని విషయాలను ఆరా తీసి త్వరలోనే స్పష్టత ఇచ్చే అవకాశాలున్నాయి. కాగా, సజీవదహనమైన పూజిత చేతి వాచ్ 11.30 గంటలకు ఆగిపోయింది. అంటే సంఘటన రాత్రి 11 నుంచి 12 గంటల మధ్య జరిగే అవకాశాలున్నట్లు స్పష్టత వస్తోంది.