చెవిరెడ్డికి నిన్న పులివర్తి నాని, నేడు నానీ భార్య సవాల్ .. చంద్రగిరి రీ పోలింగ్ పై సవాళ్ళ పర్వం
చంద్రగిరి రీపోలింగ్ విషయంలో అగ్గి రాజుకుంది. చంద్రగిరి రీపోలింగ్ విషయంలో టీడీపీ ఫిర్యాదును పట్టించుకోకుండా కేవలం వైసీపీ ఫిర్యాదునే పట్టించుకుని 5పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరిపించటానికి ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుందని టీడీపీ అగ్గిమీద గుగ్గిలం అవుతుంది. ఇక ఈ నేపధ్యంలోనే టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని చెవి రెడ్డి భాస్కర్ రెడ్డి పై సవాల్ విసిరారు . చెవిరెడ్డి కి దమ్ముంటే తుమ్మలగుంట లోనూ , ఆ నాలుగు గ్రామాల్లో కూడా రీ పోలింగ్ పెట్టించాలని పులివర్తి నాని సవాల్ విసిరారు . ఇక భర్తకు తీసిపోను అన్నట్టుగా నానీ భార్య కూడా చెవి రెడ్డికి తాజాగా సవాల్ విసిరారు.
రీపోలింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో పర్యటించిన పులివర్తి నానీ భార్య సుధారెడ్డి..ఈసీపై ఫైర్
రీపోలింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో పర్యటించిన పులివర్తి నానీ భార్య సుధా రెడ్డి ఓటమి భయంతోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి టీడీపీకి కంచుకోటగా ఉన్న ప్రాంతాల్లో రీ పోలింగ్ నిర్వహించడానికి అడ్డదారులు తొక్కుతున్నారంటూ విరుచుకుపడ్డారు.పోలింగ్ జరిగిన మరుసటి రోజే తాము 25 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరపాలని స్పందించని ఈసీ చెవిరెడ్డి ఫిర్యాదు చేస్తే స్పందిచడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. తుమ్మలగుంటలో రిగ్గింగ్ జరుగుతోందని విషయం తెలిసి తాను అక్కడికి వెళితే వాహనం అద్దాలు పగులగొట్టి టీడీపీ, మీడియా శ్రేణులపై చెవిరెడ్డి అనుచరులు దాడులకు పాల్పడ్డారని నాని సతీమణి ఫైర్ అయ్యారు. ఇదంతా ఎన్నికల అధికారులకు కనిపించలేదా అని ప్రశ్నించారు.
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కి సవాల్ విసిరిన పులివర్తి నానీ భార్య సుధారెడ్డి
దీంతో అధికార తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సవాళ్ళు, ప్రతిసవాళ్ళతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సవాల్ విసిరారు. ఐదు చోట్ల రీపోలింగ్ కే కాదు నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ కు తాము సిద్ధమని అందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సిద్ధమా అంటూ సుధారెడ్డి సవాల్ విసిరారు. దీంతో చంద్రగిరి నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య ఉన్న ఆగ్రహావేశాలు ఎంతగా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.
నిన్న పులివర్తినానీ .. నేడు నానీ భార్య సవాళ్లు .. చంద్రగిరిలో హాట్ టాపిక్
నిన్నటికి నిన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి పులివర్తి నానీ సవాల్ విసరగా, తాజాగా పులర్తి నానీ సతీమణి సుధా రెడ్డి కూడా సవాల్ విసిరారు. చంద్రగిరి నియోజకవర్గం మొత్తం రీపోలింగ్ పెట్టినా తాము సిద్ధంగా ఉన్నామని చెవిరెడ్డి సిద్ధంగా ఉన్నాడా అంటూ ఆమె విసిరిన సవాల్ ఇప్పుడు చంద్రగిరిలో చర్చనీయాంశంగా మారింది. ఒకర్ని మించి ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు,ప్రతివిమర్శలు, సవాళ్లు , ప్రతి సవాళ్ళతో చంద్రగిరి రాజకీయం రసకందాయంగా మారింది.